Gali Janardhan Reddy: ‘గాలి’ జైలు శిక్ష రద్దు
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:32 AM
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డికి సీబీఐ కోర్టు విధించిన జైలుశిక్షను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది.

ఓబుళాపురం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డికి ఊరట
ఆయనతోపాటు మరో ముగ్గురు నిందితులకు జైలు శిక్ష రద్దుతోపాటు బెయిల్ మంజూరు
సీబీఐ కోర్టు తీర్పును కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
తీర్పుతో గాలి అసెంబ్లీ సభ్యత్వం పునరుద్ధరణ!
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డికి సీబీఐ కోర్టు విధించిన జైలుశిక్షను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. గాలితోపాటు ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర తీర్పుతో కర్ణాటక శాసనసభ సభ్యుడిగా గాలి జనార్దన్రెడ్డి సభ్యత్వం పునరుద్ధరణ జరగనుంది. ఓఎంసీ కేసులో బెయిల్ ఇవ్వడంతోపాటు జైలుశిక్షను రద్దు చేయాలంటూ గాలి జనార్దన్రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫూజ్ అలీఖాన్, ఓఎంసీ కంపెనీ వేర్వేరు క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టి బుధవారం తీర్పు వెలువరించింది. నిందితులందరికీ బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్ రూ.పది లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, సీబీఐ కోర్టు నిర్దేశించిన మొత్తానికి ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. రాజగోపాల్ రూ.ఒక లక్ష వ్యక్తిగత బాండ్, రెండు పూచీకత్తులు సమర్పించాలని తెలిపింది. నిందితులెవరూ హైకోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. ఇక ఈ కేసులో ప్రధాన పిటిషన్లు ఆగస్టులో విచారణకు రానున్నాయి. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి
కౌంటర్ ఎందుకు వేయలేదు?
ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ (డిశ్చార్జి) పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిప్పి పంపి నెలరోజుల వుతున్నా.. ఎందుకు ఆలస్యమైందని సీబీఐని ప్రశ్నించింది. ఈ పిటిషన్ను మూడునెలల్లో పరిష్కరించాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన గడువు నిర్దేశించినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ తెలంగాణ చీఫ్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. ‘సీబీఐ వాదన వినలేదు’ అనే కారణంతోనే శ్రీలక్ష్మికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. సీబీఐ పూర్తిస్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.