IPS VC Sajjanar: ఫేక్ ఫేస్బుక్ ఐడీతో మోసం.. స్పందించిన సజ్జనార్..
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:40 PM
ఓ సైబర్ నేరగాడు ఐపీఎస్ అధికారి సీవీ సజ్జనార్ పేరుతో ఫేస్బుక్లో మోసానికి పాల్పడ్డాడు. సజ్జనార్ స్నేహితుడిని డబ్బు కాజేశాడు. ఈ సంఘటనపై సజ్జనార్ స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టు పెట్టారు.
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు కూలీ పనులు చేసుకునే వారినే కాదు.. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారిని కూడా ఈజీగా బురిడీకొట్టిస్తున్నారు. లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో సెలెబ్రిటీల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలు చేయటం బాగా పెరిగింది. తాజాగా, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఫేస్బుక్ ద్వారా ఓ వ్యక్తి నుంచి 20 వేల రూపాయలు దోచేశారు. ఈ సంఘటనపై సజ్జనార్ స్పందించారు.
తన ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ముఖ్య గమనిక.. నా పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు 'నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి' అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు. దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు 20,000 రూపాయలు మోసగాళ్ల ఖాతాకు పంపారు. నా వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీ లింక్ ఇది..( https://www.facebook.com/share/1DHPndApWj/) ఇది మినహా నా పేరుతో ఉన్న మిగతా ఖాతాలన్నీ నకిలివే.
ఈ ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైం టీం తొలగించే పనిలో ఉంది. నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్లో వచ్చే రిక్వెస్ట్లపై స్పందించకండి. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి. ఒకవేళ అలా ఎవరైనా మెసేజ్లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, వీడియో కాల్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్లైన్కు లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలం’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ముఖంపై మొటిమలు ఉంటే ఇలా చేయండి..
హైదరాబాద్లో ఫైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం