Share News

Bandi Sanjay: దేశంలో జిల్లాకో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌

ABN , Publish Date - May 25 , 2025 | 04:40 AM

దేశంలోని ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తెలిపారు.

Bandi Sanjay: దేశంలో జిల్లాకో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌

  • ఈ ఆర్థిక ఏడాదిలో నెలకొల్పేందుకు కృషి

  • ఫోరెన్సిక్‌ నెట్‌వర్క్‌ పటిష్ఠానికి చర్యలు: సంజయ్‌

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. దీంతో పాటు అధునాతన పరికరాలతో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లను విస్తరిస్తామని చెప్పారు. న్యాయ ప్రక్రియలో ‘ఫోరెన్సిక్‌-ఫస్ట్‌ అప్రోచ్‌’ను భాగం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ‘నూతన నేర చట్టాల నేపథ్యంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ సేవల బలోపేతం’ అంశంపై చండీగఢ్‌లోని ఫోరెన్సిక్‌ సెంట్రల్‌ సైన్స్‌ ల్యాబోరేటరీ కార్యాలయంలో రెండు రోజులపాటు ఆలిండియా సీఎ్‌ఫఎ్‌సఎల్‌, ఎస్‌ఎ్‌ఫఎల్‌ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. శనివారం జరిగిన ముగింపు సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. ‘‘కొత్త క్రిమినల్‌ చట్టాల అమలులో భాగంగా న్యాయ ప్రక్రియను మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చాలంటే ఫోరెన్సిక్‌ సేవలను ఇంకా బలోపేతం చేయడంతోపాటు ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది.


నేర దర్యాప్తులో ఫోరెన్సిక్‌ అధికారులు శాస్త్రీయ ఆధారాలను సేకరించడాన్ని కొత్త చట్టాలు తప్పనిసరి చేశాయి. అయితే, చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ సరైన ఫోరెన్సిక్‌ మౌలిక సదుపాయాలు లేవు. శిక్షణ పొందిన శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పెండింగ్‌ కేసులు న్యాయ ప్రక్రియను బలహీనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో ఆధునిక పరికరాలతో కూడిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లను స్థాపించటం, నేరస్థుల వద్దే ఆధారాలను సేకరించేందుకు మొబైల్‌ యూనిట్ల ఏర్పాటుపై దృష్టిసారిస్తున్నాం. ఫోరెన్సిక్‌లో ఏఐ సాంకేతికతను ప్రవేశపెడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రతి జిల్లాలో ఒక ప్రభావవంతమైన ఫోరెన్సిక్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రాలకు ఆర్థిక, సాంకేతిక, శిక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని సంజయ్‌ వివరించారు. కాగా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇద్దరు నేతలకు టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కేటాయించింది.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 04:40 AM