Khammam: నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
ABN , Publish Date - May 31 , 2025 | 03:56 AM
ఖమ్మం జిల్లాలో నకిలీ నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఏన్కూర్ మండల పరిధిలో రూ.15 లక్షల విలువైన 564 కిలోల పత్తి విత్తనాలు జప్తు చేశారు.

ఏన్కూర్లో 544 కిలోల విత్తనాల సీజ్
11 మందిపై కేసు.. 9 మంది అరెస్ట్: ఖమ్మం ఎస్పీ
ఖమ్మం/ ఏన్కూర్, మే 30 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో నకిలీ నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఏన్కూర్ మండల పరిధిలో రూ.15 లక్షల విలువైన 564 కిలోల పత్తి విత్తనాలు జప్తు చేశారు. మధిర మండలంలో శుక్రవారం నకిలీ విత్తనాలు లభ్యమయ్యాయి. ఏన్కూర్ మండల పరిధిలో జరిపిన తనిఖీల్లో 11 మందిపై కేసు నమోదు చేయగా, తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని ఖమ్మం జిల్లా పోలీసు కమిషనర్ (సీపీ) సునిల్ దత్ చెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వివరించారు.
ఏన్కూర్ మండలం రేపల్లెవాడ గ్రామ శివారుల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న సమాచారంతో మూడు టాస్క్ఫోర్స్ బృందాలు చేపట్టిన తనిఖీల్లో.. వెనిగండ్ల శ్రీహరిరావు వ్యవసాయ భూమిలో 210 కిలోల విత్తనాలు, ఉమ్మినేని నరేష్ ఇంట్లో 120 కిలోలు, ఇదే మండలానికి చెందిన పోలేటి కోటేశ్వరరావు వద్ద 20 నకిలీ విత్తన ప్యాకెట్లు, గాజుల నరసింహారావు వద్ద 450 గ్రాముల విత్తనాలు స్వాధీనం చేసుకున్నాయి.