Pending Bills: ఇల్లు సరే.. పెండింగ్ బిల్లులూ మంజూరు చెయ్యండి
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:50 AM
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండా తాజా మాజీ సర్పంచ్ సందేబోయిన లావణ్య తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

తమని ఆదుకోవాలని తాజా మాజీ సర్పంచ్ లావణ్య వినతి
అక్కన్నపేట, జూలై 27 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండా తాజా మాజీ సర్పంచ్ సందేబోయిన లావణ్య తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాడుబడిన స్కూల్ భవనంలో ఆశ్రయం పొందుతున్న తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె.. పెండింగ్ బిల్లులపై ఎలాంటి హామీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు రూ.10 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని వివరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లు నమోదుకు వచ్చిన అధికారులు పెండింగ్ బిల్లులపై ఏ హామీ ఇవ్వలేదని తెలిపారు. కాగా, 2019లో బీఆర్ఎస్ తరఫున సర్పంచ్గా గెలిచిన లావణ్య.. బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. బిల్లులు రాక ఆస్తులను అమ్ముకొని ఆమె పడుతున్న కష్టాలను ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే..