DGP Jitender: మాదక ద్రవ్యాలకు ఉమ్మడి నిఘాతో చెక్
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:42 AM
దేశంలో మాదక ద్రవ్యాల రవాణ, వినియోగాన్ని అడ్డుకునేందుకు దర్యాప్తు సంస్థలన్నీ సరఫరాదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలని, ఉమ్మడి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ జితేందర్ అన్నారు.

అధికారులకు డీజీపీ జితేందర్ సూచన
హైదరాబాద్, జూన్12 (ఆంధ్రజ్యోతి): దేశంలో మాదక ద్రవ్యాల రవాణ, వినియోగాన్ని అడ్డుకునేందుకు దర్యాప్తు సంస్థలన్నీ సరఫరాదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలని, ఉమ్మడి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ జితేందర్ అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మాదకద్రవ్యాల నియంత్రణ విభాగాల అధికారుల తొలి సమావేశాన్ని గురువారం హైదరాబాద్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ తెలంగాణ లో మాదకద్రవ్యాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మాదక ద్రవ్య వ్యాపారుల నెట్వర్క్ వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన నేపధ్యంలో సంబంధింత విభాగాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని టీజీనాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య కోరారు. సమావేశంలో గోవా, కేరళ, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్, కస్టమ్స్, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఈడీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.