Rajanna Sircilla: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:27 AM
పంట దిగుబడి ఆశించిన మేర లేకపోవడం, అప్పులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గంభీరావుపేట, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పంట దిగుబడి ఆశించిన మేర లేకపోవడం, అప్పులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దుద్దెడి శంకర్(55) తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో వరి, కౌలుకు తీసుకున్న రెండెకరాల్లో మామిడి సాగు చేశాడు.
వరి, మామిడి ఆశించిన దిగుబడి రాలేదు. రూ.4 లక్షల వరకు అప్పులయ్యాయి. దీనికి తోడు అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో అప్పులు తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెందిన శంకర్ శనివారం సాయంత్రం పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.