Damodara Rajanarsimha: కొవిడ్, డెంగీ పేరిట ఆందోళనకు గురిచేయొద్దు
ABN , Publish Date - May 25 , 2025 | 04:12 AM
కొవిడ్, డెంగీ వ్యాధుల పేరిట రోగులను ఆందోళనకు గురిచేసి, దోచుకునే ప్రయత్నం చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

రోగులను దోచుకునే ప్రయత్నం చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు
దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): కొవిడ్, డెంగీ వ్యాధుల పేరిట రోగులను ఆందోళనకు గురిచేసి, దోచుకునే ప్రయత్నం చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కొవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు మంత్రి సూచించారు. శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నియంత్రణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భారత్లో పరిస్థితి సాధారణంగానే ఉందని, జేఎన్.1 వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని, ప్రస్తుతం కొవిడ్పై ఆందోళనకర పరిస్థితులేమీ లేవని అధికారులు వివరించారు.
రాష్ట్రంలో అక్కడక్కడ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని, వారికి చికిత్స అందించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. జలుబు, దగ్గులాగే కొవిడ్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని, ప్రజలు పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నీటి నిల్వ ఉంటే దోమలు పెరిగి, వ్యాధులు వ్యాపించే ప్రమాదముంటుందని, ఈ విషయంపై ప్రజలకు అర్థమయ్యేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.