HIV: ఆ 26 జిల్లాల్లో హెచ్ఐవీ టెస్టులు పెంచండి
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:23 AM
రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 26 జిల్లాల్లో హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ముప్పు ఎక్కువగా ఉన్న ప్రజలను గుర్తించి, అవగాహన సదస్సులు నిర్వహించండి:దామోదర
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 26 జిల్లాల్లో హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ముప్పు ఎక్కువగా ఉన్న ప్రజలను గుర్తించి, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం (టీశాక్స్) అధికారులతో మంత్రి సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) సెంటర్ల పనితీరు, మందుల సరఫరా, పరీక్షలు, కౌన్సిలింగ్ సేవలపై మంత్రి ఆరా తీశారు. 2024-25లో 19.02 లక్షల మందికి హెచ్ఐవీ టెస్టులు చేయగా, 9415 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 1.24 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని, వారికి ఏఆర్టీ సెంటర్ల ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 5 వేల కంటే ఎక్కువ మంది రోగులు ఉన్నారని, మరో 13 జిల్లాల్లో 2-5 వేల మంది రోగులున్నారని వివరించారు. ఈ 26 జిల్లాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. 2030 నాటికి హెచ్ఐవీని పూర్తిగా నియంత్రించాలన్న లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు అనుగుణంగా టీశాక్స్ పనిచేయాలని చెప్పారు.