Bhadradri Temple: భద్రాచలం దేవస్థానంలో అన్యమత ప్రచారం
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:26 AM
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శేష వస్ర్తాల విక్రయ కౌంటర్లో అన్యమత ప్రచారం జరగడం కలకలం రేపుతోంది. వస్త్రాలు కొనుగోలు చేసే భక్తులకు ఇచ్చిన సంచిపై అన్యమతానికి చెందిన వాక్యాలు ఉండటం వివాదానికి కారణమైంది.

వస్త్రాల కౌంటర్లో సంచిపై అన్యమత వాక్యాలు
భద్రాచలం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శేష వస్ర్తాల విక్రయ కౌంటర్లో అన్యమత ప్రచారం జరగడం కలకలం రేపుతోంది. వస్త్రాలు కొనుగోలు చేసే భక్తులకు ఇచ్చిన సంచిపై అన్యమతానికి చెందిన వాక్యాలు ఉండటం వివాదానికి కారణమైంది. గుంటూరుకు చెందిన మేళ్లచెరువు జనార్దనరావు అనే భక్తుడు ఆదివారం తమ కుటుంబ సభ్యులతో సీతారామచంద్రుల దర్శనం చేసుకున్నారు. శేష వస్ర్తాల విక్రయ కౌంటర్లో రెండు చీరలతో పాటు ఇతర వస్ర్తాలను కొనుగోలు చేశారు. కౌంటర్ నిర్వాహకులు వస్ర్తాలను పెట్టి ఇచ్చిన సంచులపై అన్యమతానికి సంబంధించిన వాక్యాలు ముద్రించి ఉండటంతో జనార్ధనరావు కుటుంబసభ్యులు అవాక్కయ్యారు.
ఈ ఘటనపై భద్రాద్రి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఘటన దురదృష్టకరమని, దేవస్థానంలో అన్యమత ప్రచారం జరకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో ఈవో తమ సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కౌంటర్లో మరికొన్ని అన్యమత ప్రచార సంచులు కూడా లభ్యమైనట్లు సమాచారం. దీంతో కాంట్రాక్టరు ఎస్వీసీహెచ్ సుబ్బారావుకు నోటీసు జారీ చేసి 24 గంటలలో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.