Share News

Meenakshi Natarajan: సామాజిక న్యాయానికి కట్టుబడి పదవులు

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:15 AM

కాంగ్రెస్‌ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని, ఆ మేరకే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పదవుల పంపిణీ జరుగుతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ స్పష్టం చేశారు.

Meenakshi Natarajan: సామాజిక న్యాయానికి కట్టుబడి పదవులు

  • కాంగ్రెస్‌ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు: మీనాక్షి

  • గ్రామస్థాయిలో పకడ్బందీగా పార్టీ నిర్మాణం చేపట్టాలి: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని, ఆ మేరకే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పదవుల పంపిణీ జరుగుతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు (డీసీసీ), రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్‌ సమావేశంలో మీనాక్షి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి పదవిలోనూ సామాజిక న్యాయం పాటించామన్నారు. పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. రాహుల్‌గాంధీ మార్గదర్శనంలో ‘సమాజంలో ఎవరి వాటా వారికే’ అనే సిద్ధాంతంతో కాంగ్రెస్‌ నడుస్తోందని చెప్పారు.


మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర పరిశీలకులు, కో-ఆర్డినేటర్లు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణం సకాలంలో పూర్తిచేయాల్సిన అవసరముందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ‘జై బాపూ, జై భీమ్‌, జై సంవిధాన్‌’ కార్యక్రమాలను రాష్ట్రంలో విస్తృతంగా, విజయవంతంగా నిర్వహించామన్నారు. కాగా, మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి మహేశ్‌ గౌడ్‌ను గాంధీభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Jun 14 , 2025 | 03:15 AM