బ్యాంకు గ్యారంటీ బదులు ఐఆర్డీఏ బాండ్లు
ABN , Publish Date - May 31 , 2025 | 04:54 AM
నిర్మాణ పనులకు బ్యాంకు గ్యారంటీల బదులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) జారీ చేసే బాండ్లను అనుమతించాలని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలపై..

బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ల భేటీలో నిర్ణయం
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ పనులకు బ్యాంకు గ్యారంటీల బదులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) జారీ చేసే బాండ్లను అనుమతించాలని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలపై బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్ల కమిటీ (బీవోసీఈ) సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనం కోసం నీటిపారుదలశాఖతో పాటు రోడ్లు భవనాలు, జెన్కో, పురపాలక, పంచాయతీరాజ్శాఖల అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించింది.
శుక్రవారం బీవోసీఈ చైౖర్మన్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ (అడ్మిన్) అంజద్ హుస్సేన్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా బ్యాంకు గ్యారంటీల బదులు ఐఆర్డీఏఐ బాండ్ల అంశంపైనే చర్చించారు. నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు వినియోగించే సామగ్రి ధరల పెరుగుదలకు అనుగుణంగా ధరలను 1 శాతం పెంచడానికి అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా అధ్యయనం చేసి, నివేదిక అందించే బాధ్యతను కమిటీకి అప్పగించారు.