Dharmapuri Arvind: రేవంత్, కవిత మంచి స్నేహితులు
ABN , Publish Date - May 24 , 2025 | 04:57 AM
సీఎం రేవంత్, ఎమ్మెల్సీ కవిత మంచి స్నేహితులని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎంగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్, ఎప్పుడు కూడా కవితను విమర్శించలేదని చెప్పారు.

కేసీఆర్ పిల్లలు రాజకీయాల్లోకి రావడం వల్లే బీఆర్ఎ్సకు ఈ దుస్థితి
వాస్తవానికి.. కేసీఆర్ తర్వాతి స్థానం హరీశ్దే
మాకు ప్రాధాన్యత పెరుగుతుందనే బీఆర్ఎస్ ప్లీనరీలో బీజేపీ గురరించి ఎక్కువ మాట్లాడలేదు: అర్వింద్
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్, ఎమ్మెల్సీ కవిత మంచి స్నేహితులని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎంగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్, ఎప్పుడు కూడా కవితను విమర్శించలేదని చెప్పారు. శుక్రవారం ఏబీఎన్ డిబేట్లో అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం వల్లనే బీఆర్ఎ్సకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. న్యాయంగా మాట్లాడితే కేసీఆర్ తర్వాతి స్థానం హరీశ్దే అని చెప్పారు. కేసీఆర్ తెలివైన నేత అని, ఆయనకు రాజకీయాలు తెలుసునని, ఒకరి గురించి ఎక్కువ మాట్లాడడం వల్ల వారికి అనవసరంగా ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని, ఈ విషయం కవితకు తెలియదని అన్నారు. బీజేపీకి ప్రాధాన్యత పెరుగుతుందని గుర్తించే బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ తమ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడలేదని పేర్కొన్నారు.
కేసీఆర్ అందర్నీ కలుపుకొనిపోయే నాయకుడని, ఆయన పదమూడేళ్ల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ఆంధ్రావాళ్లను తట్టుకుని రాష్ట్రాన్ని సాధించడం ఆయనకే సాధ్యమైందని, లేదంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదన్నారు. తామెంత విమర్శించినా ఈ విషయంలో ఆయనదే ఘనత అని పేర్కొన్నారు. వాస్తవానికి నాడు కేసీఆర్పై విశ్వసనీయత లేదని, కానీ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే కాంక్ష ఉందని, ఆ వాదాన్ని ఎత్తుకున్న కేసీఆర్కు విషయ పరిజ్ఞానం, భాషలో పట్టు ఉందని చెప్పారు. తన వాగ్దాటితో అందర్నీ ఒప్పించే సత్తా ఆయనకు ఉందని చెప్పారు. తాను వేర్వేరు అంశాలపై కేసీఆర్ను విమర్శించినా, సుదీర్ఘ పోరాటంలో ఆయన అందర్నీ కలుపుకొని వెళ్లారని చెప్పారు.