Dharmapuri Arvind: రేవంత్ తన గురువుతో మాట్లాడాలి
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:37 AM
ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు మంత్రి ఉత్తమ్ ఉత్తరాలు రాస్తూ ఫోన్లు చేస్తూ కొత్త నాటకమాడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.

బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు ఉత్తమ్ నాటకాలు
బనకచర్లపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు: అర్వింద్
హైదరాబాద్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు మంత్రి ఉత్తమ్ ఉత్తరాలు రాస్తూ ఫోన్లు చేస్తూ కొత్త నాటకమాడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ‘చంద్రబాబు కాలేజీలోనే చదివానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ ... గురువుకు తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు ఆమోదం పలికారన్నారు. కాంగ్రెస్ నాయకులు నీటిపారుదల గురించి అవగాహన లేకుండా బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
కానీ కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ‘ఇదంతా కేసీఆర్ డైరెక్షన్లో ఉత్తమ్ చేస్తున్న పని. దానికి నిదర్శనం ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ చెప్పినట్లే సీట్లు కేటాయించారు. అతను సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్ నాయకుడ’ని అర్వింద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుందని, తెలంగాణకు అన్యాయం చేయబోదని ఆయన స్పష్టం చేశారు.