Share News

అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:44 PM

తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉంది.

అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం

- 2009 చట్టానికి ఆదిలోనే పాతర

- గత ప్రభుత్వ హయాం నుంచే చట్టానికి తూట్లు

- ఉచిత విద్యకు నోచుకోని పేద విద్యార్థులు

- 25 శాతం అమలులో విద్యాసంస్థల నిర్లక్ష్యం

- కోర్టు ఆదేశాలతోనూ మార్పురాని వైనం

- నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

మంచిర్యాల, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పిల్లలకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (1వ తరగతి నుంచి ఎనిమిది తరగతులు)ను ఉచితంగా అభ్యసించే హక్కును కల్పించింది. ఏదేని కారణం చేత ఎలిమెంటరీ విద్యను అభ్యసించకుంటే ఎలాంటి ప్రాథమిక విద్య చదవాల్సిన అవసరం లేకుండానే విద్యార్థి నేరుగా తన వయస్సుకు సరిపడా తరగతిలో చేరే అవకాశం ఉంది.

అమలుగాని విద్యాహక్కు చట్టం...

ఎలిమెంటరీ స్థాయిలో పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అమలు చేసేందుకు గాను 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టం-2009ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సి ఉంది. అయితే తెలంగాణలో ఈ చట్టం అమలుకు నోచుకోకపోవడంతోపాటు ఆదిలోనే చట్టం నిర్వీర్యం అయింది. ప్రభుత్వాల వైఖరి కారణంగా ప్రత్యేక అర్హతలుగల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాం నుంచే చట్టాన్ని విస్మరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏ పాఠశాలలోనూ అది అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, ప్రత్యేక పాఠశాలలు 25 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సి ఉంది. చట్టం ప్రకారం అనాఽథలు, అంగవైకల్యంగల పిల్లలు, హెచ్‌ఐవీ సోకిన పిల్లలకు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యలో 25 శాతం ఉచిత విద్యను అందించాల్సి ఉండగా, షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ)కు 10శాతం, షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు నాలుగు శాతం, బలహీనవర్గాలు (బీసీ)కు ఐదు శాతం, మైనారిటీలకు- ఆరు శాతం ఉచితంగా విద్యను బోధించాల్సి ఉంది.

ససేమిరా అంటున్న విద్యాసంస్థలు....

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రత్యేక అర్హతలు గల విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేసే విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయి. బడ్జెట్‌ పాఠశాలలను మినహాయిస్తే ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కార్పొరేట్‌, ఇతర ప్రైవేటు విద్యాసంస్థలు చట్టాన్ని తుంగలో తొక్కడమేగాకుండా, ప్రశ్నించిన వారికి అడ్మిషన్లు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 200 వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉండగా, దాదాపు 60వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో ఎక్కడ కూడా విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రైవేటు బడుల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ విషయమై ధృష్టిసారించకపోవడంతో చట్టం నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉండగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే విద్యాహక్కు చట్టం అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడితే ప్రత్యేక అర్హతలుగల విద్యార్థులకు మేలు చేకూర్చినట్లు అవుతుంది.

కోర్టు ఆదేశాలు అమలయ్యేనా?

పేదలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం రిజర్వేషన్ల కల్పనపై హామీఇవ్వాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం అమలుకోసం జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని అండర్‌ టేకింగ్‌ కోరింది. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడం లేదంటూ 2020లో హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇదే విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కూడా రెండుసార్లు విచారణ చేపట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు 19న మెమో జారీ చేసినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. హైకోర్టు ఆదేశాలతో ఈ విద్యా సంవత్సరం నుంచైనా రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకుంటుందా? లేదా అనే సందేహాలు వ్యక్తమమతున్నాయి.

Updated Date - Jun 11 , 2025 | 11:44 PM