మరింత చేరువగా ‘రైతు నేస్తం’
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:52 PM
రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తూ రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు.

- ప్రస్తుతం 15 రైతు వేదికల్లో ప్రసారం
- అదనంగా మండలానికి రెండు క్లస్టర్లలో ఏర్పాటు
వాంకిడి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తూ రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యకక్రమాన్ని మరింత విస్తరించేందుకు గానూ ప్రతీ మండలంలో కొత్తగా రెండు వ్యవసాయ క్లస్టర్లను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన క్లస్టర్లలో రైతు నేస్తం కార్యక్రమానికి సంబందించిన వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన పనులు చేపడుతున్నారు.
- రైతు నేస్తం ఉద్దేశం...
వ్యవసాయంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించింది. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ను అనుసంధానం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతుల ద్వారా తరగతులు నిర్వహించి పంటల సాగు, మెళుకువలు, యాజమాన్య పద్ధతులను, చీడపీడల నివారణ చర్యలను రైతులకు వివరిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నూతన వ్యవసాయ సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చేందుకు ఎంతగానో దోహదపడుతోంది. దీంతో రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొదటి దశలో మండలానికి ఒక రైతు వేదికను ఎంపిక చేయగా అదనంగా మరో రెండు క్లస్టర్లకు విస్తరిస్తున్నారు. జిల్లాల్లో మొత్తం 70 క్లస్టర్లు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 15 రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తుండగా నూతనంగా మరో 30 వేదికల్లో నిర్వహించనున్నారు.
- ప్రస్తుతం కొనసాగుతున్న రైతువేదికలు
జిల్లాలో ప్రస్తుతం 15 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. వాంకిడి, కాగజ్నగర్, ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాని, లింగాపూర్, జైనూర్, సిర్పూర్(యు) సిర్పూర్(టి) రెబ్బెన, పెంచికల్పేట్, దహేగాం, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్ రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాలు కొనసాగుతున్నారు.
రైతులకు మరింత ప్రయోజనం
- మిలింద్ కుమార్ ఏడీఏ- ఆసిఫాబాద్
రైతునేస్తం అద్భుతమైన క్యాక్రమం. వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు సాగు పద్ధతులను తెలియచేయడంతో పాటు రైతులతో ముఖాముఖి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అభ్యుదయ రైతుల అనుభవాలు చూడడం ద్వారా రైతుల్లో సేద్యంపై నమ్మకం పెరుగుతుంది. నూతనంగా ఎంపిక చేసిన క్లస్టర్లలో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం పనులు కొనసాగుతున్నాయి. త్వరలో రైతు నేస్తం సేవలు అందుబాటులోకి వస్తాయి. రాబోయే రోజుల్లో రైతులకు మరింత మేలు జరుగుతుంది. రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
అదనంగా ఎంపిక చేసిన గ్రామాలు
----------------------------------------------------------------
మండలం ఎంపికైన గ్రామాలు
-----------------------------------------------------------------
వాంకిడి బంబార, ఇంధాని
ఆసిఫాబాద్ చిర్రకుంట, రహపల్లి
పెంచికల్పేట్ కమ్మర్గాం, చేడ్వాయి
దహెగాం కుంచవెల్లి, గిరివెల్లి
కౌటాల మొగడ్ధగర్, సాండ్గావ్
బెజ్జూర్ కుకడ, ఔట్సారంగపల్లి
సిర్పూర్(టి) చింతకుంట, వెంపల్లి
కాగజ్నగర్ జంబూగ, దుర్గానగర్
తిర్యాని గిన్నెధరి, మాణిక్యపూర్
రెబ్బెన తక్కలపల్లి, నారాయణపూర్
లింగాపూర్ కాంచన్పల్లి, లింగాపూర్
సిర్పూర్(యూ) సిర్పూర్(యూ), పంగిడి
జైనూర్ లెండిజల, ఊశేగాం
కెరమెరి సాంగ్వి, సుద్దాపూర్
చింతలమానెపల్లి డబ్బా, రుద్రాపూర్
-------------------------------------