Nirmal Fight: స్థానిక సంస్థల ఎన్నికల పోరు.. సిద్దమైన నిర్మల్!
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:38 AM
Nirmal Fight: నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.

నిర్మల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) స్థానాలు ఖరారు కావడంతో ఇక స్థానిక సమరం ఊపందుకోబోతోంది. జిల్లాలో (Nirmal) మొత్తం 18జడ్సీటీసీ స్థానాలు ఉండగా 156 ఎంపీటీసీ స్థానాలకు గానూ మరో ఎంపీటీసీ స్థానం అదనంగా పెరిగింది. దీంతో 157 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. ఈ స్థానాల సంఖ్య ఖరారు కావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ చేసే ఔత్సాహికులు ఇక రిజర్వేషన్ల ఆధారంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలుండగా మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీకి జడ్పీ చైర్మన్ పదవి దక్కనుంది.
జిల్లాలో కీలకంగా నిలిచే జడ్పీచైర్మన్ పదవిపై ఆటు అధికార కాంగ్రెస్ పార్టీ (Congress) రెండు నియోజకవర్గాలకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీలు దృష్టి సారించాయి. ఈ రెండు పార్టీల్లోని పలువురు సీనియర్ నాయకులు జడ్పి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వీరు మొదట జడ్పీటీసీగా గెలిచేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జడ్పీటీసీ గెలిచిన తర్వాతే చైర్మన్ పదవిని ఏ నేతకు కట్టబెట్టాలనే అంశాన్ని ప్రధాన పార్జీలు నిర్ణయించనున్నాయి. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రానట్లయితే రాజకీయంగా తమ ఉనికికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని వీరు తమ అనుచరుల వద్ద పేర్కొంటున్నారు.
జిల్లాలోని 18 మండలాలకు గానూ ఎంపీపీ (MPP) పదవులపై దృష్టి సారించిన ప్రధాన పార్టీల నేతలు ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఎంపీటీసీ సభ్యులే ఎంపీపీగా ఎన్నిక కానుండడంతో.. మొదట తమ ఎంపీటీసీ స్థానంపై పట్టుసాధించుకోవాలని యోచిస్తున్నారు. వీరుకూడా రిజర్వేషన్లు (Reservations) తమకు కూలంగా రావాలని కోరుకుంటున్నారు. దీంతో పాటు జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు పోటీ చేసేవారు కూడా ఇప్పటినుంచే తమ సన్నాహాల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండగా సర్పంచ్ పదవులు మాత్రం పార్టీలకు అతీతంగా జరగనున్నాయి. అయినా ప్రధాన పార్టీలు సర్పంచ్ పదవులకు తమ కార్యకర్తలనే రంగంలోకి దించి పరోక్షంగా తమ అభ్యర్థులను ప్రచారం చేయనున్నాయి.
కీలకం కానున్న జడ్పీటీసీ పదవులు...
జిల్లాలో అత్యంత ప్రాధాన్యతగల పదవిగా చెప్పుకునే జడ్పీచైర్మన్ పీఠంపై ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే సీరియస్గా దృష్టి కేంద్రీకరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని తమ ప్రతిష్టను ఇనుమడింపజేసుకోవాలని యోచిస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న కారణంగా ఆ పార్టీ జడ్పీటీసీ ఎన్నికలను సవాలుగా తీసుకోనుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ రావడాన్ని కూడా ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా 15 జడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని జడ్పీచైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డితో పాటు రామారావు పటేల్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారంటున్నారు. వీరికి తోడుగా స్వత్రంత్ర అభ్యర్థులు సైతం జడ్పీటీసీ పోటీకి ఇప్పటి నుంచే సిద్దమవుతుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంపీ ఈటల సంచలన కామెంట్స్.. ప్రొహిబిషన్ కాదు.. ప్రమోషన్ శాఖ
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి