’కస్తూర్బా’లో కొత్త రుచులు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:27 PM
కస్తూర్బా విద్యాలయాల్లో(కేజీబీవీ) చదివే బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కస్తూర్బా విద్యాలయాలను దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది.

- బాలికల పౌష్టికాహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- వారానికి రెండుసార్లు చికెన్, ఐదుసార్లు గుడ్లు
- అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు
- ప్రారంభమైన కొత్త మెనూ
- వంట మనుషులకు పూర్తయిన శిక్షణ
బెజ్జూరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా విద్యాలయాల్లో(కేజీబీవీ) చదివే బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కస్తూర్బా విద్యాలయాలను దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే ఇటీవల కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో చదివే బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బాలికలు పౌష్టికాహారలోపంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం బాలికలకు చదువుతో పాటు పోషకాహారం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురుకుల విద్యాలయాల్లో మాదిరిగానే కేజీబీవీల్లో కూడా మెస్ చార్జీలను పెంచి విద్యార్థుల ఆహార మెనూలో మార్పులు చేసింది.
పెరిగిన మెస్ చార్జీలు....
గతంలో కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో చదివే ఒక్కో విద్యార్థికి మెస్ చార్జీల కింద 1,225 రూపాయలు అందించగా, ఇప్పుడు దీన్ని 1,740రూపాయలకు పెంచారు. అంటే గతంలో కంటే 515 రూపాయలు మెస్ చార్జీలు పెంచారు. పాఠశాలలు ప్రారంభమైన గురువారం నుంచే కొత్త మెనూ అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం కేజీబీవీ బాలికలు ఈ ఏడాది నుంచి కొత్త వంటలు రుచి చూస్తున్నారు. కొత్త మెనూ ప్రకారం నెలలో రెండుసార్లు మాంసాహారం, వారంలో ఐదుసార్లు గుడ్లు, ప్రతిరోజూ నెయ్యి వడ్డిస్తారు. కొత్త ఆహార మెనూ రూపొందించిన ప్రభుత్వం దీన్ని అమలు చేసే బాధ్యతను విద్యాశాఖకు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు కొత్త మెనూ అమలు పరుస్తున్నారు. సమర్థవంతంగా అమలు చేయడానికి కొత్త వంటకాల తయారీపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొత్త వంటకాల తయారీపై తొలుత హైదరాబాద్లో 8వ తేదీన కొందరికి శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందిన వారితో జిల్లాలోని మిగితా వారందరికీ ప్రాంతాల వారీగా వంటకాల తయారీపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమాలు మంగళవారం ముగిశాయి.
మారిన మెనూ..
ఈ పథకాన్ని అమలు చేసేందుకు స్కూళ్ల ప్రారంభం నుంచే పర్యవేక్షించాలని జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. మారిన మెనూ పాఠశాలల పునఃప్రారంభమైన గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రతిరోజు మారే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఉదయం అల్పాహారం కింద సోమవారం ఉప్మా పెడితే మరుసటి రోజు ఇతర వంటకాల్లో ఏదైనా ఒకదాన్ని వడ్డిస్తారు. ఇలా రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వివిధ రకాల రుచులతో వంటకాలు అందిస్తారు. కొత్తగా రూపొందించిన ఆహార పట్టిక విద్యాలయాల్లో నోటీసు బోర్డుపై పెట్టి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే బాలికల తల్లిదండ్రులకు కూడా దీనిపై అవగాహన కల్పించనున్నారు.
జిల్లాలో 15స్కూళ్లు.....
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 15కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన మండలాల్లోనూ కేజీబీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా విద్యార్థులు వివితిధ పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రస్తుతం కొత్త విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నందున ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయాల్లో ప్రతి ఏటా ప్రవేశాల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
మెనూ ఇలా....
ఉదయం: ఉప్మా, జీరా రైస్, పులిహోరా, టమాట కిచిడీ, రాగి జావ, సాంబారు. బూస్టు, పూరి, బోండా, వడ, చపాతి, అరటి పండు
మధ్యాహ్నం: టమాట పప్పుతో అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడకబెట్టిన గుడ్డు, చికెన్
సాయంత్రం: పకోడి, ఉడకబెట్టిన శనగలు, ఎగ్బజ్జీ, బెల్లంపట్టీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు
రాత్రివేళ: వివిధ రకాల కూరలతో అన్నం, మజ్జిగ, సాంబారు
వేతనాల పెంపు ఏది?
రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలల్లో కొత్త మెనూ అమలు చేయడం వరకు బాగానే ఉన్నా ఆయా పాఠశాలల్లో వంట చేస్తున్న వారికి వేతనాల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని వంట కార్మికులు వాపోతున్నారు. జిల్లాలోని ఒక్కో పాఠశాలలో సుమారు నాలుగు, నుంచి ఐదుగురు వంట మనుషులు పని చేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి నెలకు 9,500 రూపయాలు చెల్లిస్తున్నారు. ఈ వేతనం తమ కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. దీనికితోడు కేజీబీవీల్లో కొత్త మెనూ అమలుతో తమకు మరింత భారం పెరిగిందని వాపోతున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి రాత్రి వరకు పాఠశాలల్లో పని చేస్తున్నామని కొత్తగా అమల్లోకి తెచ్చిన మెనూతో మరింత భారంగా మారనుందని వంట మనుషులు వాపోతున్నారు. పనికి తగ్గ వేతనం కింద తమకు నెలకు 19,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
పకడ్బందీగా అమలుకు చర్యలు..
- భాగ్యలక్ష్మి, జీఈసీవో, ఆసిఫాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాల్లో కొత్త మెనూ అమలుకు చర్యలు తీసుకుంది. బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు రూపొందించిన మెనూ అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల చదువుతో పాటు మెరుగైన భోజనం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు పునఃప్రారంభమైన గురువారం నుంచే కొత్త మెనూ అమలు చేపడుతున్నాం.