పశువుల అక్రమ రవాణా నివారణకు చర్యలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:29 PM
పశువుల ఆక్రమ రవాణా నివారణకు జిల్లా సరిహద్దులోని గూడెం చెక్పోస్టు వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు.

మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
గూడెం జిల్లా సరిహద్దులో చెక్పోస్టు తనిఖీ
దండేపల్లి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పశువుల ఆక్రమ రవాణా నివారణకు జిల్లా సరిహద్దులోని గూడెం చెక్పోస్టు వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. మంచిర్యాల-జగిత్యాల జిల్లాల సరిహద్దులో దండేపల్లి మండలం గూడెం చెక్పోస్టును గురువారం ఆయన ఆకసిక్మంగా సందర్శించి వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈనెల 7న బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులు, కోడే దూడలను అక్రమంగా తరలించకుండా ఉండేందుకు గూడెం చెక్పోస్టు వద్ద ప్రతీరోజు వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా చెక్పోస్టులలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. పశువులు రవాణా విషయంలో నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే బాధ్యులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ పండగ జరుపుకోవాలని సూచించారు. అనంతరం చెక్పోస్టు వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. డీసీపీ వెంట లక్షెట్టిపేట సీఐ డి రమణమూర్తి, దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్సైలు ఎండి తహసీనోద్దీన్, గోపతి సురేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.