Share News

‘ఆమె’కు అక్షర వెలుగులు

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:25 PM

అతివల్లో అక్షరాస్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏటా నిరక్షరాస్యుల గుర్తింపునకు సన్నద్ధమవుతోంది.

‘ఆమె’కు అక్షర వెలుగులు
కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు(ఫైల్‌)

- సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా

ఉల్లాస్‌ కార్యక్రమానికి శ్రీకారం

- జిల్లాలో 22,494 మంది నిరక్షరాస్యులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అతివల్లో అక్షరాస్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏటా నిరక్షరాస్యుల గుర్తింపునకు సన్నద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చదవడం, రాయడం రానివారిని గుర్తించి వారికి పాఠాలు చెప్పించడమే ప్రధాన లక్ష్యం. కాగా ఈసారి ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులపై దృష్టి సారించింది. 19 ఏళ్లు నిండిన వారిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా నిర్దేశించారు. ఉల్లాస్‌(అండర్‌ స్ఠాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ అన్‌ ఇన్‌ సొసైటీ) పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) నిరక్షరాస్యులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా విద్యాశాఖ, డీఆర్డీవో అధికారులు ఉల్లాస్‌ను సంయుక్తంగా చేపడుతున్నారు.

- స్వయం సహాయక సంఘాల్లో..

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో 22,494 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వారి వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చింది. సర్వే వివరాలను, వారు చదివిన తరగతుల వారీగా పొందుపర్చారు. పదో తరగతి లోపు మానేసిన వారిని సార్వత్రిక పది, పదో తరగతితో అపేస్తే సార్వత్రిక ఇంటర్‌ చేసేలా ప్రొత్సహిస్తారు. ఇంటర్‌ ఉత్తీర్ణత ఉంటే డిగ్రీ చేయించాలని నిర్ణయించారు. పూర్తిగా నిరక్షరాస్యులు ఉంటే సంఘంలోనే చదువు వచ్చిన వారిని వలంటీరుగా నియమించి అక్షరాలు నేర్పిస్తారు. ఒకవేళ సంఘాల్లో ఎవరు చదువుకున్నవారు లేకుంటే పిల్లలతో ఈ ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించారు. తద్వారా మహిళా సంఘాల సభ్యులు పూర్తిగా అక్షరాస్యత పెరిగి భవిష్యత్‌లో ఉపాధి పొందవచ్చు.

- ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా బోధన..

కేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షర భారత్‌ కార్యక్రమాన్ని పదేళ్ల కాల పరిమితితో ప్రారంభించగా 2018లోనే ముగిసింది. ఆ తర్వాత 2020లో కొత్త విద్యా విదానం అమలులోకి వచ్చింది. దీని ద్వారా అందరికి విద్య అందించేందుకు 2022 నుంచి 2027 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్‌ఐఎల్‌పీ)లో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లిటరసీ ‘ఉల్లాస్‌’కు రూపకల్పన చేసింది. ప్రాథమిక, ఆర్థిక, డిజిటల్‌ అక్షరాస్యత కల్పించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమంపై అవగాహన, జీవన నైపుణ్యాలు పెంపొందించి తద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘ఉల్లాస్‌’ను తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోను కార్యాచరణ ప్రారంభమైంది. 100 శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెలుతోంది.

- రోజుకు రెండు గంటల చొప్పున...

నిరక్షరాస్యులకు రోజులో రెండు గంటల చొప్పున 200 గంటలు బోధిస్తారు. తరగతుల నిర్వహణకు పాఠశాలలు, ప్రభుత్వ కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి డిజిటల్‌ కంటెంట్‌తో కంప్యూటర్‌, టీవీలను సమకూర్చనున్నారు.

వంద శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం

- నాగరాజు, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా కార్యాచరణ తయారు చేశాం. ఇది వరకే గ్రామసభలు నిర్వహించి ప్రత్యేక సర్వే చేపట్టాం. ఇందులో ఏఏ స్థాయికి చెందిన వారు ఎంత వరకు చదివి ఉన్నారో గుర్తించాం. పూర్తి స్థాయిలో ఉల్లాస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల, జిల్లాస్థాయి అధికారులను సమన్వయ పరుస్తాం. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు సైతం భాగస్వాములు కావాలి.

Updated Date - Jun 04 , 2025 | 11:25 PM