Share News

60 డివిజన్లు..1.79లక్షల ఓటర్లు

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:35 PM

మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ తుదిరూపం దిద్దుకోనుంది. ఇప్పటికే కార్పొరేషన్‌గా ప్రకటిస్తూ గెజిట్‌ కూడా విడుదలైంది. మొత్తంగా లక్ష79వేల 516 మంది ఓటర్లతో 60 డివిజన్లుగా అవతరించనుంది.

60 డివిజన్లు..1.79లక్షల ఓటర్లు

- ముసాయిదా జాబితా సిద్ధం

- 11 వరకు అభ్యంతరాల బ్‌ఃస్వీకరణ

- అనంతరం తుది ముసాయిదా జాబితా విడుదల

- తుదిరూపం దిద్దుకోనున్న మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌

మంచిర్యాల, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ తుదిరూపం దిద్దుకోనుంది. ఇప్పటికే కార్పొరేషన్‌గా ప్రకటిస్తూ గెజిట్‌ కూడా విడుదలైంది. మొత్తంగా లక్ష79వేల 516 మంది ఓటర్లతో 60 డివిజన్లుగా అవతరించనుంది. ఇందుకు సంబంధించిన డివిజన్ల ప్రక్రియ పూర్తికాగా ఈ నెల 11 వరకు అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అలాగే 12 నుంచి 16వ తేదీ వరకు స్వీకరించిన అభ్యంతరాలపై కసరత్తు చేసి కలెక్టర్‌ ఆమోదం తీసుకోనున్నారు. 19న పురపాలకశాఖకు నివేదించి, 21వ తేదీన తుది ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. దీంతో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి కానుంది. ఒక్కో డివిజన్‌లో 2700 నుంచి 3300 వరకు ఓటర్లను కేటాయించారు.

- విలీన గ్రామాలతో...

మున్సిపాలిటిగా ఉన్న మంచిర్యాలలో సమీప గ్రామాలు, నస్పూర్‌ మున్సిపాలిటీని కలిపి ప్రభుత్వం కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసింది. సమీప గ్రామాలైన వేంపల్లి, కొత్తపల్లి, ముల్కల్ల, గుడిపేట, నర్సింగాపూర్‌, చందనాపూర్‌తో పాటు నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్‌, సీతరాంపల్లి, సీసీసీ, నస్పూర్‌ గ్రామాలను విలీనం చేశారు. ప్రస్తుతం మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 2,48,283 మంది జనాభా ఉన్నారు.

- ఎన్నికలకు సిద్ధం..

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వం ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. వార్డుల విభజన ప్రక్రియ పూర్తికాగానే రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని సీఎం సూచించిన నేపథ్యంలో అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందే పురపాలక సంఘాల సమరానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూలై మూడోవారంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు 2025 జనవరి 28న ముగిసింది. దీంతో అప్పటి నుంచి మున్సిపాలి టీలు ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. దీంతో అధికారులపైన అదనపు భారం పడి అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పాలకమండళ్లు లేకపోవడంతో కేంద్రప్రభుత్వం ప్రతీ సంవత్సరం విడుదల చేసే నిధులు కూడా నిలిచిపోయాయి. దీంతో అభివృద్ధి కుంటుపడుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం ద్వారా మున్సిపాలిటీలను బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

- త్వరలో రిజర్వేషన్ల ఖరారు...

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గ్రామాలు పంచాయతీల్లో వార్డుల విభజన ప్రక్రియ ముగియగా ఓటరు జాబితాలు సైతం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో వార్డుల విభజన చేపట్టగా ఆ ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. రిజర్వేషన్లు కూడా త్వరలో ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

- సిద్ధపడుతున్న ఆశావహులు...

మంచిర్యాల కార్పొరేషన్‌లో వార్డుల విభజన ముగియడం త్వరలో రిజర్వేష న్‌ ప్రక్రియ కూడా చేపట్టనుండడంతో వివిధ డివిజన్లకు పోటి చేసే ఆశావహు లు అందుకు సిద్ధపడుతున్నారు. కార్పొరేషన్‌ లో 60 డివిజన్లకు గాను టికెట్లు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 05 , 2025 | 11:35 PM