Share News

Kaleshwaram Project: ఒక్కొక్కరి ఆస్తులు రూ.200 కోట్లపైనే!

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:12 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ల ఆస్తులపై ఏసీబీ గురిపెట్టింది. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేసిన భూక్యా హరిరామ్‌ను గత ఏప్రిల్‌ 26న అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు..

Kaleshwaram Project: ఒక్కొక్కరి ఆస్తులు రూ.200 కోట్లపైనే!

  • నెలన్నరలో ఇద్దరు ఇంజనీర్లపై ఏసీబీ దాడులు

  • గత ఏప్రిల్‌ 26న ఈఎన్సీ భూక్య హరిరామ్‌ అరెస్టు

  • తాజాగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌కు రిమాండ్‌

  • వీరిద్దరూ కాళేశ్వరంలో కీలకంగా వ్యవహరించిన వారే

  • ఏసీబీ నజర్‌లో మరి కొన్ని కాళేశ్వరం తిమింగలాలు

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ల ఆస్తులపై ఏసీబీ గురిపెట్టింది. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేసిన భూక్యా హరిరామ్‌ను గత ఏప్రిల్‌ 26న అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. దాదాపు 200కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. తాజాగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు బుఽధవారం అరెస్టు చేసి, గురువారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ మేరకు శ్రీధర్‌ను 14రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, శ్రీధర్‌ నివాసం, ఇతర ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ.200కోట్లపైగా ఆస్తులను ఆయన కూడబెట్టినట్లు గుర్తించారు.


శ్రీధర్‌కు సంబంధించిన బ్యాంకు లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, అతడి బినామీల వ్యవహరాలు తెలుసుకునేందుకు కస్టడీ పిటిషన్‌ వేసి మరింత లోతుగా విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్రమార్జనకు పాల్పడిన ఇంజనీర్లపై ఏసీబీ నిఘా కొనసాగిస్తుంది. పక్కా సమాచారం సేకరించిన తర్వాతే సోదాలు చేపట్టి, కేసులు నమోదు చేస్తున్నారు. శ్రీధర్‌, హరిరామ్‌ కేసుల్లోనూ లగ్జరీ విల్లాలు, ఫ్లాట్లు, ఖరీదైన ఏరియాల్లో ఇళ్ల స్థలాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.

Updated Date - Jun 13 , 2025 | 04:12 AM