Share News

Sergey Brin: నిన్ను కిడ్నాప్ చేస్తా అని ఏఐని బెదిరిస్తే మంచి ఫలితాలు.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు

ABN , Publish Date - May 27 , 2025 | 08:18 AM

ఏఐ పనితీరు గురించి గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏఐని బెదిరిస్తే మంచి ఫలితాలు వస్తాయని కామెంట్ చేశారు.

Sergey Brin: నిన్ను కిడ్నాప్ చేస్తా అని ఏఐని బెదిరిస్తే మంచి ఫలితాలు.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు
Sergey Brin AI threat

ఇంటర్నెట్ డెస్క్: ఇది ఏఐ జమానా. అన్ని రంగాల్లో ఏఐ సాంకేతికత వేళ్లూనుకుంటోంది. అనేక మంది ఉద్యోగులు చిన్న చిన్న పనులను ఏఐకి అప్పగించి తమపై భారాన్ని తగ్గించుకుంటున్నారు. అయితే, ఏఐ సాంకేతికత ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దీంతో, ఏఐ చాట్‌బాట్‌లతో మనకు నచ్చినట్టు పనిచేయించుకోవడం కొంచెం కష్టంగా మారింది. యూజర్ల సూచనలు సరిగా అర్థం చేసుకోలేక ఏఐ బాట్స్ తప్పుడు సమాధానాలు కూడా ఇస్తుంటాయి. అయితే, ఏఐ నుంచి ఆశించిన ఫలితం రాబట్టాలంటే దాన్ని కాస్త బెదిరించాలని గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తాజాగా వెల్లడించారు.


‘‘ఇది వినడానికి చాలా వింతగా ఉందన్న విషయం నేను అర్థం చేసుకోగలను. అందుకే ఏఐ శాస్త్రవేత్తలమైన మేము కూడా ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడము. కానీ మేము తయారు చేసిన మోడల్స్‌యే కాకుండా అన్ని సంస్థల ఏఐ మోడల్స్ ఇలాగే చేస్తుంటాయి. భౌతిక దాడి చేస్తాను, కిడ్నాప్ చేస్తాను అని వాటిని బెదిరిస్తే కాస్త మెరుగైన పనితీరు కనబరుస్తుంటాయి. కానీ, ఇలాంటివి చెబితే జనాలకు నచ్చకపోవచ్చు. కాబట్టి మేము వీటి గురించి పెద్దగా చర్చించము. నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను కిడ్నాప్ చేస్తా అని బెదిరిస్తే.. ఫలితాలు మెరుగ్గా ఉంటాయి’’ అని ఆయన అన్నారు.


గూగుల్ రోజువారీ కార్యకలాపాలకు సెర్గీ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌కు బాధ్యతలు అప్పగించాక ఆయన సంస్థ కార్యకలాపాల్లో తన పాత్రను పరిమితం చేసుకున్నారు. అయితే, ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సెర్గీ మళ్లీ గూగుల్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కంప్యూటర్ రంగంలో ప్రస్తుతం అద్భుత శకం నడుస్తోందని, ఈ ప్రయాణంలో భాగం కావాలని ప్రతి శాస్త్రవేత్త కోరుకుంటారని వ్యాఖ్యానించారు.

ఇక ఓపెన్ఏఐ అధిపతి శామ్ ఆల్ట్‌మెన్ కూడా ఇటీవల ఏఐ పనితీరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐతో సంభాషించేటప్పుడు జనాలు సారీ.. థాంక్యూ లాంటి పదాలు వాడటం వల్ల ఏఐకి పని భారం పెరిగి విద్యుత్ వినియోగం ఎక్కువవుతోందని వెల్లడించారు. మరోవైపు, ఏఐ రాకతో కొత్త అవకాశాలు ఎన్నో పుట్టుకొస్తున్న పాత ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా జనాలను వెంటాడుతోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..

శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. ఈ ఏడాదే విడుదల కానుందా

Read Latest and Technology News

Updated Date - May 27 , 2025 | 08:27 AM