WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు ఎన్ని కోట్లంటే.. ప్రైజ్మనీనీ భారీగా పెంచిన ఐసీసీ
ABN , Publish Date - May 15 , 2025 | 07:25 PM
టెస్ట్ క్రికెట్కు మళ్లీ ఆదరణ పెంచేందుకు ఐసీసీ కొన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రైజ్మనీనీ భారీగా పెంచింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే.

టీ-20లు, వన్డేలతో పోల్చుకుంటే టెస్ట్ క్రికెట్ (Test Cricket) నానాటికీ ఆదరణ కోల్పోతోంది. టెస్ట్ మ్యాచ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్కు మళ్లీ ఆదరణ పెంచేందుకు ఐసీసీ (ICC) కొన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC Final) ప్రైజ్మనీనీ భారీగా పెంచింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఆ రెండేళ్లలో టెస్ట్లు ఆడి మెరుగైన విజయాలు సాధించి ర్యాంకింగ్స్లో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తారు (WTC Final winner Prize Money).
ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతన్నాయి. జూన్ 11న లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రైజ్మనీగా 5.76 మిలియన్ డాలర్లు (రూ.49.27 కోట్లు) ఇవ్వబోతున్నారు. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు ఇవ్వనున్నారు. ఇక, రన్నరప్నకు 18.46 కోట్లు అందించనున్నారు. అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో నిలిచిన భారత్కు రూ.12.31 కోట్లు అందించనున్నారు. అలాగే నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్కు రూ.10.26 కోట్లు, ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్కు రూ. 8.2 కోట్లు ఇవ్వనున్నారు.
ఇక, టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో నిలిచిన శ్రీలంకకు రూ.7.18 కోట్లు, ఏడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్కు రూ.6.15 కోట్లు, ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్కు రూ.5.13 కోట్లు, తొమ్మిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్కు రూ.4.10 కోట్లు అందించనున్నారు. కాగా, జూన్ 11న జరగబోయే ఫైనల్ మ్యాచ్తో 2023-25 డబ్ల్యూటీసీ సీజన్ ముగియబోతోంది. వచ్చే నెలలో ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ప్రారంభమవుతుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..