Pahalgam terror attack: పహల్గాం దాడిపై అఫ్రీది పిచ్చి వ్యాఖ్యలు.. సీరియస్ అయిన పాక్ మాజీ స్టార్
ABN , Publish Date - Apr 28 , 2025 | 08:39 PM
పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ దాడి గురించి పాకిస్తాన్కు చెందిన చాలా మంది నేతలు, ఆర్మీ అధికారులు పిచ్చి వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూడా భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు.

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతు ప్రకటించాయి. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ దాడి గురించి పాకిస్తాన్ (Pakistan)కు చెందిన చాలా మంది నేతలు, ఆర్మీ అధికారులు పిచ్చి వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది (Shahid Afridi) కూడా భారత్ (India)పై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ తన పౌరులపై తనే దాడి చేసుకుని ఆ నెపాన్ని పాక్పై నెడుతోందని ఆరోపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో అఫ్రీదిపై పాక్కు చెందిన మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా (Danish Kaneria) విమర్శలు గుప్పించాడు.
* పహల్గాంలో ఉగ్రవాదులు దాదాపు గంట పాటు పర్యాటకులను చంపుతూ ఉన్నారు. 8 లక్షల మందిలో ఒక్క భారతీయ సైనికుడు కూడా ఆ సమయంలో అక్కడకు రాలేదు. వచ్చిన తర్వాత మాత్రం వారు పాకిస్తాన్ను నిందిస్తున్నారు. భారత్ స్వయంగా ఉగ్రదాడికి పాల్పడుతుంది. స్వంత పౌరులను చంపుతుంది. ఆ తర్వాత పాకిస్తాన్ను నిందిస్తుంది * అని ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రీది వ్యాఖ్యానించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఫ్రీదిపై పాక్ మాజీ స్పిన్నర్ కనేరియా విమర్శలు గుప్పించాడు.* అతను ఎప్పుడూ తీవ్రవాద భావజాలంతోనే ఉంటాడు. నా అభిప్రాయం ప్రకారం అతడికి భారతీయ టెలివిజన్లో లేదా ఇతర మాధ్యమాల్లో ప్రాచుర్యం ఇవ్వకూడదు. అతడు నన్ను ఇస్లాంలోకి మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అలాగే నాతో కలిసి భోజనం చేయడానికి కూడా నిరాకరించాడు *అని కనేరియా ట్వీట్ చేశాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..