IndiGo: మీ వల్ల భారీగా నష్టపోయా.. ఇండిగో ఎయిర్లైన్స్పై ప్యాసెంజర్ గుస్సా
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:18 PM
ఇండిగో ఎయిర్లైన్స్ తీరు కారణంగా తాను ఓ భారీ వాణిజ్య డీల్ కోల్పోయానంటూ ప్రయాణికుడు నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అయితే, తమ తప్పేమీ లేదని ఇండిగో వివరణ ఇచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో ఎయిర్లైన్స్పై ఓ ప్రయాణికుడు నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ వల్ల తను భారీ డీల్ కోల్పోవాల్సి వచ్చిందని లింక్డ్ఇన్ వేదికగా ఫైరైపోయారు. ఇలాగైతే ప్రయాణికుల దృష్టిలో ఇండిగో విలువ మరింత పతనమవడం తప్పదని హెచ్చరించారు.
ఛయన్ గర్గ్ అనే ప్రయాణికుడు ఈ పోస్టు పెట్టారు. ‘ముంబైకి వెళ్లాల్సి ఉండటంతో నేను జైపూర్ ఎయిర్పోర్టుకు తెల్లవారుజామున 4.40 గంటలకు చేరుకున్నా. 5.10 కల్లా సెక్యూరిటీ క్లియరెన్స్ పూర్తి చేసుకున్నా. బోర్డింగ్కు అప్పటికి ఇంకా 10 నుంచి 15 నిమిషాల సమయం ఉందని ఇండిగో సిబ్బంది చెప్పారు. అప్పటికి బోర్డింగ్ గేటు వద్ద రద్దీ కూడా ఎక్కువగా ఉంది. దీంతో, నేను వాష్రూమ్కు వెళ్లాను. 12 నిమిషాల తరువాత తిరిగొచ్చి చూస్తే బోర్డింగ్ అయిపోయిందని సిబ్బంది చెప్పారు. నేను షాకైపోయా. బోర్డింగ్ అప్పుడు మొదలవుతుందని అనుకుంటే అయిపోయింది. గేట్లు మూసేశారు’ అని గర్గ్ అన్నారు.
బోర్డింగ్ క్లోజ్ చేయడంపై ముందస్తు అనౌన్స్మెంట్ ఏదీ చేయలేదని కూడా ఆయన అన్నారు. అనౌన్స్మెంట్ ఎందుకు లేదని తాను ప్రశ్నిస్తే అది సైలెంట్ ఎయిర్పోర్టు అని సిబ్బంది బదులిచ్చారని ఆయన తెలిపారు. అంతకుముందే ఇండిగో డెహ్రాడూన్ ఫ్లైట్కు సంబంధించిన అనౌన్స్మెంట్ తాను విన్నానని అన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే సిబ్బంది మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారని గర్గ్ అన్నారు.
తనకు క్లైంట్తో మీటింగ్ ఉందని, భారీ డీల్ మిస్సయ్యే ముప్పు ఉందని ప్రాథేయపడినా సిబ్బంది వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దీంతో, మేము క్లైంట్ను కోల్పోయాము. రూ.2.65 లక్షలు బూడిద పాలయ్యాయి. నెల రోజుల శ్రమ అంతా సెకెన్ల వ్యవధిలో వృథా అయిపోయింది. భారత విమానయాన రంగంలో కస్టమర్లపై నిర్లక్ష్యం ఎక్కువైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్టుపై ఇండిగో కూడా స్పందించింది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అయితే, ప్రామాణిక నిబంధనల ప్రకారమే తమ సిబ్బంది నడుచుకున్నారని వివరణ ఇచ్చింది. గర్గ్ లేటుగా గేటు వద్దకు వచ్చారని పేర్కొంది. మరో ఫ్లైట్లో వెళ్లేందుకు అవకాశం ఇచ్చినా గర్గ్ స్వయంగా తిరస్కరించారని పేర్కొంది. ప్రయాణికులకే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఆసుపత్రిలో ఉన్న ఉద్యోగిపై బాస్ శాడిజం.. చివరకు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..