AI-Human Doom: ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:01 PM
ఏఐతో జనాభా భారీగా పడిపోయి మానవ సమాజానికే ముప్పు ఏర్పడుతుందని భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సుభాష్ కక్ తాజాగా హెచ్చరించారు. 2300 నాటికల్లా ప్రపంచ జనాభా ప్రస్తుతం 8 బిలియన్ల నుంచి 100 మిలియన్లకు పడిపోతుందని వార్నింగ్ ఇచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ సాంకేతికత నానాటికీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ ప్రభావంతో మధ్యతరగతి వర్గం కనుమరుగవుతుందని ఇప్పటికే కొందరు జోస్యం చెబుతున్నారు. అయితే, ఏఐతో మానవ సమాజానికే ముప్పు ఉందని ఏఐ నిపుణుడు, భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సుభాష్ కక్ హెచ్చరించారు. ఏఐ కారణంగా 2300 సంవత్సరం నాటికల్లా ప్రపంచ జనాభా కేవలం100 మిలియన్లకు కుంచించుకుపోతుందని హెచ్చరించారు. న్యూయార్క్, లండన్ వంటి మహా నగరాలు నిర్మానుష్యంగా మారిపోతాయని అన్నారు. ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీ రీజెంట్స్ ప్రొఫెసర్ సుభాష్.. ఓ యూకే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు (AI-Human Population Decline).
ఉద్యోగాలు మొదలు ప్రభుత్వ నిర్ణయాలు, పిల్లల పెంపకం వరకూ మానవ జీవితానికి సంబంధించి ప్రతి అంశంలో ఏఐ ప్రభావం అమితంగా పెరిగిపోతుందని ప్రొ. సుభాష్ తెలిపారు. మనుషులకు ఉండే చైతన్యం ఏఐకి లేకపోయినా మనం చేసే పనులన్నీ అది చేసి పెడుతుందని అన్నారు. ఏఐతో త్వరలో వచ్చే విచ్ఛిన్నకర మార్పులను మానవ సమాజం తట్టుకోలేదని హెచ్చరించారు. రాబోయే రెండు శతాబ్దాల్లో అన్ని వృత్తులు మానవ ప్రమేయం అవసరంలేని విధంగా ఆటోమేషన్కు గురవుతాయని అన్నారు. ఫలితంగా పిల్లల్ని పెంచడం ఆర్థికంగా సామాజికంగా పెను భారమై ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోతుందని చెప్పారు. ‘ఇక ప్రజలు పిల్లల్ని కనాలని కోరుకోరు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో భారీగా జనాభా తగ్గుదలను చూస్తున్నాం. దాదాపు ఇదే రీతిలో ఐరోపా, చైనా, జపాన్లో పరిస్థితులు కనిపిస్తున్నాయి’ అని ఆయన అన్నారు.
‘ప్రస్తుతం ప్రపంచ జనాభా 8 బిలియన్లు. కానీ 2300 లేదా 2380 నాటికి జనాభా 100 మిలియన్లకు పడిపోతుంది. ఇది ప్రస్తుత యూకే జనాభాకు సమానం’ అని అన్నారు. భారీ నగరాలన్నీ నిర్మానుష్యంగా, దెయ్యాల దిబ్బల్లా మారుతాయని, సమాజం కుప్పకూలుతుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలను సైతం ప్రభావితం చేయగలిగే స్థితికి ఏఐ చేరుకుంటుందని అన్నారు. ఇప్పటికే యూఎస్, యూరోపియన్ యూనియన్లో పలు నిర్ణయాలను ఏఐ ఆల్గోరిథమ్లు ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఏఐతో ప్రమాదంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్కు కూడా దాదాపు ఇలాంటి హెచ్చరికలే చేశారు.
ఇవి కూడా చదవండి:
విదేశీ మహిళ ముందు పరువు పోగొట్టుకున్న భారతీయ పురుషులు.. వైరల్ వీడియో
పెళ్లితో ప్రయోజనాలపై యువతి పోస్టు.. నెట్టింట పెద్ద చర్చ