Grand Ugadi in DC: తెలుగు భాష, సంస్కృతీ, సాహిత్య వేదికే ఆశయంగా
ABN , Publish Date - Apr 30 , 2025 | 10:34 PM
అమెరికాలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. చిన్నారుల నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, తెలుగు వంటకాలు ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి

అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది పెద్దలు, చిన్నారులు, మహిళల సందడితో.. తెలుగు ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా ఆపాత మధురాలు, కళా, సాహిత్య యుగళ గీతాలతో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అధ్యక్షులు రవి అడుసుమిల్లి తెలిపారు.
శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు రాత్రి 12 గంటల వరకూ నిరంతరంగా సాగాయి. రక రకాల వేషధారణతో చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్ని తరాల వారిని ఆకట్టుకున్నాయి. తదుపరి నిరావల్ బ్యాండ్ వారి ప్రత్యేక కార్యక్రమం యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఉగాది పండుగ ఘన సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో పసందైన విందును సభికులకు అందించారు.
అధ్యక్షులు రవి మాట్లాడుతూ.. ఎల్లలు లేని తెలుగు భాష .. అనాదిగా తెలుగు బాష వైభవం, కళా, సంస్కృతీ సంప్రదాయాలను సరిహద్దులను దాటించి ఈనాడు లక్షలాది మంది తెలుగు వారు నివసిస్తున్న అమెరికాలో సైతం ప్రతి తెలుగింటి పండుగను జరుపుకుంటూ.. ప్రాముఖ్యతను చాటుతూ.. అన్ని తరాల వారిని అలరిస్తూ, తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో అగ్ర తాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుంది. గత సంవత్సరం స్వర్ణోత్సవాలను జరుపుకున్న ఈ సంస్థ, మరో స్వర్ణోత్సవ కాలం పాటు ఈ పరంపరను కొనసాగిస్తామని తెలిపారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల క్రితం ఎందరో పెద్దల సహాయ, సహకారాలతో మొదలైన ఈ ప్రవాస తెలుగు సంస్థ. ఇంతింతై అటుడింతై అన్నట్లు ఎదిగి ఎన్నో ప్రవాస సంఘాలకు ఆదర్శంగా, మూలంగా నిలిచింది. పూర్వ అధ్యక్షులు త్రిలోక్ కంతేటి, కిశోరె దంగేటి, మన్నే సత్యనారాయణ, సుధా పాలడుగు మాట్లాడుతూ.. మాతృబాష తెలుగును అమెరికాలో సైతం ఈ తరానికి చేరువ చేసే ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమని.. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించిన పూర్వాధ్యక్షులు కృష్ణ లాం ను అభినందించారు.
చివరిగా సంస్థ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నే, రాజేష్ కాసారనేని, యశస్వి బొద్దులూరి, భానుప్రకాష్ మాగులూరి, చంద్ర మాలావతు, గంగ శ్రీనివాస్, విజయ్ అట్లూరి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, ప్రవీణ్ కొండక, ఉమాకాంత్, పద్మజ, శ్రీవిద్య, పావని తదితరులు.. సభికులకు ధన్యవాదములు తెలిపి బాషా, సంస్కృతిని కాపాడుకోవటం, కళలను ప్రోత్సహించటం, కళాకారులను సత్కరించటం తెలుగింటి సంప్రదాయమని తెలిపారు.
మరిన్ని వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Telugu Latest News Click Here