Share News

Mannava mohan krishna: ఏపీ లో పెట్టుబడులు పెట్టండి.. ఎన్ఆర్ఐలకు మన్నవ పిలుపు..

ABN , Publish Date - Oct 28 , 2025 | 09:18 PM

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో జరిగిన ‘మీట్ విత్ మన్నవ మోహన కృష్ణ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రవాస ఆంధ్రులు, వ్యాపార వేత్తలు, అమెరికా టీడీపీ నాయకులు,

Mannava mohan krishna: ఏపీ లో పెట్టుబడులు పెట్టండి.. ఎన్ఆర్ఐలకు మన్నవ పిలుపు..
Mannava Mohan Krishna

న్యూజెర్సీ, అక్టోబర్ 28: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో జరిగిన ‘మీట్ విత్ మన్నవ మోహన కృష్ణ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రవాస ఆంధ్రులు, వ్యాపార వేత్తలు, అమెరికా టీడీపీ నాయకులు, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పునరుద్ధరణ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రాన్ని సాంకేతిక, పారిశ్రామిక, ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అప్రతిహతం’ అని పేర్కొన్నారు.


మంత్రి నారా లోకేష్ యువతతో కలసి రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఉత్సాహం నింపుతున్నారని మోహన కృష్ణ అన్నారు. ‘టెక్నాలజీపై లోకేష్‌కు ఉన్న అవగాహన, ఆధునిక ఆలోచన, ప్రజలకు చేరువైన శైలి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. ఇటీవల గూగుల్‌తో సంతకం చేసిన చారిత్రాత్మక MOU రాష్ట్రానికి బలమైన సాంకేతిక పునాది వేస్తుంది. గూగుల్‌ డేటా సెంటర్లు, AI పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌లకు మద్దతు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాయి.’ అని అన్నారు.

Mannava-Mohan-Krishna-2.jpg

‘సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అయిన క్వాంటం వ్యాలీ అమరావతిని ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్‌గా నిలబెడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. వేలాది ఉద్యోగ అవకాశాలు, బిలియన్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఖాయం.’ అని పేర్కొన్నారు.

Mannava-Mohan-Krishna-3.jpg


‘ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమన్వయంతో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. ఇది కేవలం రాజకీయ కూటమి కాదు. ఇది అభివృద్ధి కూటమి. కేంద్రం - రాష్ట్రం సమన్వయంతో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతికత రంగాల్లో విశేష ఫలితాలు సాధ్యమవుతున్నాయి.’ అని చెప్పుకొచ్చారు.

Mannava-Mohan-Krishna-4.jpgఇదే సమయంలో అమెరికాలోని ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి మాట్లాడిన మోహన కృష్ణ.. ‘ప్రవాస ఆంధ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మీరు అందరూ పరిశ్రమలు స్థాపించి, పెట్టుబడులు పెట్టి, టెక్నాలజీ పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావాలి. సీఎం చంద్రబాబు దూరదృష్టి, మంత్రి లోకేష్ నాయకత్వం కలయికతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ సుజలాం సుఫలాం రాష్ట్రంగా మారుతోంది. మన రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో కీలకం. మీ పెట్టుబడులు, మీ సహకారం ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలవు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పునర్నిర్మాణ యాత్రలో భాగస్వాములు కావాలి’ అని పిలుపునిచ్చారు.

Mannava-Mohan-Krishna-5.jpg


కార్యక్రమంలో భాగంగా మన్నవ మోహన కృష్ణను ఎన్ఆర్ఐలు సత్కరించారు. రాష్ట్రంలోని అభివృద్ధి రంగాలపై ఎన్ఆర్ఐలతో మోహన కృష్ణ విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన ప్రవాసాంధ్రులు మన్నవ మోహన కృష్ణతో పలు అంశాలపై చర్చించారు.


Also Read:

మీ ఐక్యూకు టెస్ట్.. ఈ ఫొటోలో తప్పెక్కడుందో 6 సెకెన్లలో కనిపెట్టండి..

వచ్చే ఏడాది నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రారంభం: భట్టి

Updated Date - Oct 28 , 2025 | 09:23 PM