విశ్వానికి ఆధ్యాత్మిక గురువు
ABN , Publish Date - May 30 , 2025 | 05:27 AM
ఆధ్యాత్మిక సాధన మార్గం నిస్సందేహంగా క్లిష్టమైనది. అందుకే, భగవంతుడు సాక్షాత్తూ తన పరంపరానుగతమైన సంప్రదాయానికి చెందిన ప్రామాణిక ఆచార్యుణ్ణే ఆశ్రయించాలని సూచిస్తున్నాడు. పరంపర సిద్ధాంతాన్ని...

హరేకృష్ణ
వేదాలు, శాస్త్రాలు గురువును భగవంతుడితో సమానంగా గౌరవిస్తాయి. శిష్యుణ్ణి గురువు అజ్ఞానాంధకారం నుంచి దివ్యమైన జ్ఞానం వైపు నడిపిస్తాడు. భగవద్భక్తికి గురువే ఏకైక మార్గం. అలాంటి గురువును ఎలా ఆశ్రయించాలో వివరిస్తూ ‘‘ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయంతో ప్రశ్నలు అడుగు. సేవ చెయ్యి. సత్యాన్ని దర్శించినవారైన అలాంటి గురువులు నీకు జ్ఞానోపదేశం చేయగలరు’’ అని వివరిస్తుంది భగవద్గీత.
ఆధ్యాత్మిక సాధన మార్గం నిస్సందేహంగా క్లిష్టమైనది. అందుకే, భగవంతుడు సాక్షాత్తూ తన పరంపరానుగతమైన సంప్రదాయానికి చెందిన ప్రామాణిక ఆచార్యుణ్ణే ఆశ్రయించాలని సూచిస్తున్నాడు. పరంపర సిద్ధాంతాన్ని అనుసరించనిదే ఎవరూ ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు కారు. భగవంతుడే ఆది గురువు. ఆయన పరంపర నుంచి వచ్చిన గురువు మాత్రమే భగవంతుడి సందేశాన్ని శిష్యుడికి యథాతథంగా అందించగలడు.
గురువును ఎలా ఆశ్రయించాలి?
నిజమైన ఆధ్యాత్మిక గురువును సంపూర్ణ శరణాగతి భావంతో శిష్యుడు ఆశ్రయించాలి. మిధ్యాహంకారాలను విడిచిపెట్టి... శ్రద్ధతో, ఒక దాసునిగా సేవ చెయ్యాలి. వాస్తవానికి, ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు సంతృప్తి చెందేలా చేయడమే ఆధ్యాత్మిక జీవన పురోగతి రహస్యం. జిజ్ఞాస, వినయం... ఈ రెండూ కలిసినప్పుడే అసలైన ఆధ్యాత్మిక అవగాహన కలుగుతుంది. సేవాభావం, వినయం లేకుండా అడిగే ప్రశ్నలు వ్యర్థం. గురువు పెట్టే పరీక్షలో నెగ్గాలి. శిష్యునిలో నిజమైన జిజ్ఞాసను గురువు గుర్తించినప్పుడే... ఆ శిష్యుడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గుడ్డిగా అనుసరించడం, అర్థంలేని ప్రశ్నలు వేయడం... ఈ రెండూ నిష్ప్రయోజనమే.
మూడు రకాల గురువులు
‘‘ఏ కులస్తులైనా కావచ్చు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాల్లో ఉన్నవారైనా, సన్యాసులైనా... ఇలా ఎవరైనా కావచ్చు. కృష్ణతత్త్వ విజ్ఞానం కలిగినవారైతే చాలు... వారు వర్తమ-ప్రదర్శక గురువుగా లేదా దీక్షా గురువుగా లేదా శిక్షా గురువుగా ఉండడానికి అర్హులు’’ అంటూ ‘శ్రీ చైతన్య చరితామృతం’లో గురుతత్త్వాన్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర్ వివరించారు. దీని ప్రకారం గురువులు మూడు రకాలు.
వర్తమ-ప్రదర్శక గురువు: ఆధ్యాత్మిక జీవితం గురించి మొట్టమొదటిసారి పరిచయం చేసే గురువు.
దీక్షా గురువు: శాస్త్ర ప్రమాణానుసారం దీక్షనుప్రసాదించే గురువు.
శిక్షా గురువు: ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి మార్గనిర్దేశం చేసే గురువు.
వీరిలో ఏ గురువైనా ఆ స్థానం పొందడానికి అర్హత కేవలం కృష్ణతత్త్వాన్ని పూర్తిగా గ్రహించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. వైదిక శాస్త్రాలలో పేర్కొన్న నాలుగు ప్రామాణిక సంప్రదాయాలకు చెందిన ఆచార్యులనే ఆశ్రయించాలనేది శాస్త్రాలు చెప్పిన మాట. ఈ సంప్రదాయాలన్నీ సాక్షాత్తూ భగవంతుడి నుంచి నేరుగా మొదలైనవే. వాటిలో ఒకటి... బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించినప్పుడు ప్రారంభమయింది. ఆ సంప్రదాయాన్నే నేడు ‘బ్రహ్మ-మధ్య-గౌడీయ సంప్రదాయం’గా వ్యవహరిస్తున్నారు. ఈ సంప్రదాయానికి చెందినదే హరేకృష్ణ ఉద్యమం. ఈ ఉద్యమానికి ఆచార్యులైన విశ్వగురు శ్రీల ప్రభుపాదులను ఆశ్రయించడం ద్వారా... విశుధ్ధమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని యథాతథంగా పొందవచ్చు.
అంతర్జాతీయ ఉద్యమంగా...
బ్రహ్మ-మధ్య-గౌడీయ సంప్రదాయంలో కృష్ణ చైన్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన మొదటి ఆచార్యులు శ్రీల ప్రభుపాద. శ్రీమద్భగవద్గీత, శ్రీమద్భాగవత గ్రంథాల ఆధారంగా... ఈ భక్తి ఉద్యమాన్ని ఆయన దేశదేశాల్లో విస్తరించేలా చేశారు. డెబ్భై ఏళ్ళ వయసులో, నలభై రూపాయలు చేత పట్టుకొని, విదేశాలకు ప్రయాణించి, పదకొండేళ్ళ వ్యవధిలో ఒక మహత్తర ఉద్యమాన్ని ప్రపంచమంతటా స్థాపించారు. భగవద్గీతపై పరంపరానుగత వ్యాఖ్యానాన్ని అందించారు. ‘భగవద్గీత యథాతథం’ పేరుతో ఇప్పటివరకూ యాభై కోట్లకు పైగా ప్రతులు ప్రచురితమయ్యాయి. అంతర్జాతీయంగా సనాతన ధర్మాన్ని విస్తరించి, అతి తక్కువ సమయంలో భక్త సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపించిన శ్రీల ప్రభుపాదుల నిర్విరామ కృషిని గుర్తించి... మన దేశంలోని 13 ప్రముఖ అఖాడాలు కలిసి... ఇటీవల జరిగిన కుంభమేళాలో ఆయనకు ‘విశ్వగురు’ అనే బిరుదును ప్రదానం చేశాయి. తాను ఈ ఉద్యమాన్ని ఒక పార్కులో కీర్తనతో ప్రారంభించానని, కేవలం శ్రీకృష్ణుడి పవిత్ర నామస్మరణ వల్లే ఈ ఉద్యమం వేగంగా వ్యాప్తి చెందిందని, లక్షలాది భక్తులు తనతో చేరారని శ్రీల ప్రభుపాదులవారు తరచూ చెప్పేవారు. వైష్ణవాచార్యులైన ఆయన జాతి, వర్ణ, మత, లింగ, ప్రాంత భేదాలేవీ లేకుండా... ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని స్వీకరించి, శ్రీకృష్ణ, శ్రీ లక్ష్మీ నరసింహ భక్తులుగా మారే అవకాశం కల్పించారు. ఆయన 1977లో మహాసమాధి పొందినప్పటికీ, ఎవరైనా దీక్ష తీసుకొని తన శిష్యుడిగా మారే ఒక విధానాన్ని ఏర్పరిచారు. అటువంటి పరంపరాచార్యులను భగవంతుడితో సమానంగా గౌరవించాలి.
వారు తమ ఉపదేశాల్లోని వాణి రూపంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. నేటికీ ఎవరైనా సరే... వారి శిష్యులుగా మారి, వారి ఉపదేశాలను పాటిస్తూ... కృష్ణ చైతన్యంలో పురోగమించవచ్చు. ‘హరేకృష్ణ’ మంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో జపించి, గురువు నిర్దేశించిన నియమాలను నిబద్ధతతో పాటిస్తే... ఏ వ్యక్తి అయినా శ్రీల ప్రభుపాదుల దీక్షా శిష్యుడిగా మారవచ్చు. తమ జీవితాలను శుద్ధి చేసుకొని, ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు. తద్వారా భయాలు, కలవరాలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్మెంట్,
హైదరాబాద్, 9396956984
ఇవి కూడా చదవండి
పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..