Variety Recipes: నోరూరించే రాగి రుచులు
ABN , Publish Date - May 17 , 2025 | 05:40 AM
వేసవిలో చల్లదనం ఇచ్చే రాగితో కిచిడీ, ఊతప్పం, తోప వంటకాలు ఎన్నో రుచులు ఇస్తాయి. రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు చేసే ఈ వంటకాలు ఇంట్లోనే తేలికగా చేయవచ్చు.

వంటిల్లు
వేసవి తాపాన్ని తగ్గించడంలో రాగి పిండిని మించింది లేదు. దీనితో జావ, అంబలి, సంగటి, రొట్టె ఇలా ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాం. ఇవి కాక రాగి పిండితో చేసే వెరైటీ వంటకాలు మీ కోసం...
రాగి కిచిడీ
కావాల్సిన పదార్థాలు
రాగిపిండి- అర కప్పు, పెసరపప్పు- అర కప్పు, సగ్గుబియ్యం- అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- అయిదు, టమాటా ముక్కలు- అర కప్పు, కేరట్ ముక్కలు- అర కప్పు, అల్లం తరుగు- రెండు చెంచాలు, వెల్లుల్లి తరుగు- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, మిరియాలు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నెయ్యి- నాలుగు చెంచాలు, జీడిపప్పు పలుకులు- రెండు చెంచాలు, జీలకర్ర- అర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, ఇంగువ- చిటికెడు, కొత్తిమీర తరుగు- మూడు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు
తయారీ విధానం
ఒక గిన్నెలో పెసరపప్పు తీసుకుని నీళ్లు పోసి రెండుసార్లు కడగాలి. మరో గిన్నెలో రాగిపిండి వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గరిటె జారుగా కలపాలి. ఉండలు రాకుండా చూసుకోవాలి.
స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కడిగిన పెసరపప్పు, సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కేరట్ ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మిరియాలు, పసుపు వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోయాలి. మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరవాత స్టవ్ మీద నుంచి కుక్కర్ను దించి అది చల్లారాక మూత తీసి దానిలోని మిశ్రమాన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి.
కుక్కర్ను మళ్లీ స్టవ్మీద పెట్టాలి. పప్పు మిశ్రమం వేడెక్కాక అందులో రాగి పిండి మిశ్రమం పోస్తూ బాగా కలపాలి. తరవాత ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించాలి.
స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి నెయ్యి వేసి కరగించాలి. ఇందులో జీలకర్ర, ఇంగువ, జీడిపప్పు పలుకులు, కరివేపాకు వేసి వేపాలి. ఈ తాలింపును కుక్కర్లోని మిశ్రమంలో వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. తరవాత నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ కిచిడీని వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది.
జాగ్రత్తలు
ఈ కిచిడీలో ఆలుగడ్డలు, క్యాలీఫ్లవర్ లాంటి ఇతర కూరగాయల ముక్కలతోపాటు పచ్చి బఠాణీలు కూడా వేసుకోవచ్చు.
కిచిడీ ఉడుకుతున్నప్పుడు ముద్దలా అయిందనిపిస్తే కొన్ని వేడినీళ్లు కలుపుకోవాలి.
నెయ్యి వద్దనుకుంటే నూనెతో తాలింపు పెట్టుకోవచ్చు.
రాగి ఉతప్పం
కావాల్సిన పదార్థాలు
రాగిపిండి- ఒక కప్పు, అటుకులు- ఒక కప్పు, నీళ్లు- రెండున్నర కప్పులు, అల్లం- చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, పచ్చి మిర్చి- మూడు, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- అర కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, కేరట్ తురుం- అర కప్పు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు- అర కప్పు, కారం- అర చెంచా, ఉప్పు- తగినంత, జీలకర్ర- అర చెంచా, పసుపు- చిటికెడు, వంటసోడా- అర చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, నూనె- తగినంత
తయారీ విధానం
ఒక గిన్నెలో రాగిపిండి, అటుకులు వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. గిన్నె మీద మూతపెట్టి పది నిమిషాలు నాననివ్వాలి.
మిక్సీలో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరవాత ఇందులోనే రాగిపిండి మిశ్రమం, అర కప్పు నీళ్లు పోసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండి మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీయాలి. పిండి గట్టిగా ఉందనిపిస్తే అర కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇందులో కరివేపాకు తరుగు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పావు కప్పు కేరట్ తురుం, పావు కప్పు కొత్తిమీర తరుగు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత వంటసోడా వేసి దానిపై నిమ్మరసం చిలకరించి బుడగలు వచ్చిన తరవాత పిండిలోకి కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పలుచగా కాకుండా చూసుకుంటూ అవసరమైతే మరికొన్ని నీళ్లు కలపాలి.
స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక ఒక చెంచా నూనె రాయాలి. దీనిమీద గరిటెడు పిండిని సమంగా పరచి పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, కొద్దిగా కేరట్ తురుం వేసి మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. తరవాత మూత తీసి ఊతప్పం మీద అర చెంచా నూనె వేసి రెండో వైపునకు తిప్పి మరో రెండు నిమిషాలు ఉంచాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన ఊతప్పాన్ని పళ్లెంలోకి తీయాలి.
దీనిని టమాటా, కొబ్బరి, పల్లీ చట్నీలతో తింటే రుచిగా ఉంటుంది. సాంబార్తో కూడా తినవచ్చు.
జాగ్రత్తలు
రాగులను నీళ్లలో నానబెట్టి మొలకెత్తించి తరవాత ఆరబెట్టి తయారు చేసిన పిండిని తీసుకుంటే ఊతప్పం మరింత రుచిగా ఉంటుంది.
వంటసోడా+నిమ్మరసం బదులు పావు కప్పు పుల్లని పెరుగు కలుపుకోవచ్చు.
ఈ పిండితో ఇడ్లీ లేదా గుంట పొంగలాలు కూడా తయారు చేసుకోవచ్చు.
రాగి తోప
కావాల్సిన పదార్థాలు
రాగిపిండి- ఒక కప్పు, బెల్లం- ఒక కప్పు, నీళ్లు- రెండు కప్పులు, నెయ్యి- నాలుగు చెంచాలు, పచ్చి కొబ్బరి తురుం- అర కప్పు, యాలకుల పొడి- అర చెంచా
తయారీ విధానం
స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో బెల్లం వేసి నీళ్లు పోసి కరిగించాలి. తరవాత ఈ బెల్లం నీళ్లను వడబోయాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరగించాలి. ఇందులో రాగిపిండి వేసి బాగా కలుపుతూ కమ్మని వాసన వచ్చే వరకూ మూడు నిమిషాలపాటు వేయించాలి. తరవాత పచ్చి కొబ్బరి తురుం వేసి కలుపుతూ మరో రెండు నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమం వేగిన తరవాత అందులో బెల్లం నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. పిండి మిశ్రమం... నెయ్యిని విడుస్తూ గిన్నెకు అంటుకోకుండా ముద్దలా అయ్యేవరకూ తిప్పుతూనే ఉండాలి. తరవాత యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలోకి తీయాలి. చల్లారాక ముక్కలుగా కోసుకోవచ్చు. వేడిగా తిన్నా చల్లారాక తిన్నా ఈ రాగి తోప రుచిగానే ఉంటుంది.
జాగ్రత్తలు
రాగి పిండిని చిన్న మంట మీద నిదానంగా వేయించాలి. లేదంటే పిండి మాడిపోతుంది.
వేగిన పిండి మిశ్రమంలో బెల్లం నీళ్లు కలిపేటప్పుడు విస్కర్ను ఉపయోగిస్తే ఉండలు రావు.
ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, సార పప్పు, గుమ్మడి గింజలు లాంటివి కలుపుకోవచ్చు.