భారతీయ అపోస్తులుడు
ABN , Publish Date - May 30 , 2025 | 05:10 AM
యేసు క్రీస్తు రెండువేల ఏళ్ళ క్రితం నరావతారుడైన దేవుడిగా జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ భూమిమీద సంచరించాడు. సుమారు మూడున్నర ఏళ్ళపాటు సువార్తను బోధించాడు. తన సువార్త వ్యాప్తికి...

దైవమార్గం
యేసు క్రీస్తు రెండువేల ఏళ్ళ క్రితం నరావతారుడైన దేవుడిగా జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ భూమిమీద సంచరించాడు. సుమారు మూడున్నర ఏళ్ళపాటు సువార్తను బోధించాడు. తన సువార్త వ్యాప్తికి సహాయకులుగా పన్నెండు మంది శిష్యులను ఏరఁరచుకున్నాడు. వారిలో పేతురు, యోహాను, యాకోబు, తోమా (థామస్) ముఖ్యులు. క్రీస్తు మరణం, పునరుత్థానం తరువాత... ఆయన ప్రత్యక్ష శిష్యుడైన థామస్ భారతదేశంలో అడుగుపెట్టాడు. క్రీస్తు గురించి బోధించాడు, సేవలు అందించాడు. కేరళ (మలబారు) తీరానికి సముద్రమార్గం ద్వారా చేరుకొని, కొడంగలూరు, పలయూరు, కొక్కిమంగళం, కొల్లం, నిరనం, నీలక్కల్, పరవూరుల్లో ఏడు చర్చిలు నిర్మించాడు. తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో ఉన్న తిరువితమ్కోడ్ దగ్గర మరో చర్చి నిర్మాణం చేపట్టినా పూర్తి చేయలేకపోయాడు. అందుకే దాన్ని ‘అరప్పల్లి’ అంటారు. అంటే ‘సగం’ అని అర్థం.
థామస్ క్రాస్...
థామస్ హయాంలో అనేక విద్య, వైద్య సంబంధమైన కార్యక్రమాలు అనాడే భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఇక్కడ క్రైస్తవ్యం బ్రిటిష్ వారి ద్వారా వచ్చిందనేది అవాస్తవం. దానికి ఆద్యుడు థామస్. అందుకే క్రీస్తు ప్రత్యక్ష శిష్యుడైన ఆయనను ‘భారతీయ అపోస్తులుడు’ అని పిలుస్తారు. అపోస్తులుడు అంటే ‘పంపించినవాడు’ అని అర్థం. థామస్... క్రీస్తు భారతదేశానికి పంపినవాడు. భారతదేశంలో ఏడున్నర చర్చిలు నిర్మించిన థామస్ ... చెన్నైలోని లిటిల్మౌంట్ (శాంథోమ్ చర్చి) దగ్గర ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉంటగా... అతను బతికి ఉంటే క్రైస్తవం ఇంకా ప్రబలుతుందన్న భావనతో కొందరు దుండగులు శూలంతో వెనుకనుంచి పొడిచి ఆయనను చంపేశారు. అతని పేరిట చెన్నైలో ‘శాంథోమ్ బసిలికా’ ఉంది. థామస్ భారత దేశంలో తన సేవా కార్యక్రమాల్లో ఉంటూనే... బైబిల్లోని కొత్త, పాత నిబంధనల కలయికతో... త్రిత్వాన్ని (దేవుడు, ఆయన కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ అనే మూడు) ప్రతిబింబించే విధంగా ఒక క్రాస్ను తయారు చేశాడు. దాన్ని ‘థామస్ క్రాస్’ లేదా ‘భారతీయ క్రాస్’ అంటారు. ప్రపంచంలో ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నా.. థామస్ తయారు చేసిన క్రాస్ను మన దేశం పేరుతో పిలవడం మనకు గర్వకారణం. థామస్ తన సువార్త-సేవా ప్రయాణంలో ఎందరో రోగులను స్వస్థతపరిచాడు. మరణించినవారిని బ్రతికించాడనీ,
థామస్ మృతదేహాన్ని తాకి ఎందరో రోగులు స్వస్థత పొందారనీ, వారికి పట్టిన దుష్టశక్తులు వదిలిపోయాయనీ కథలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు క్రైస్తవ మందిరాలకు ఆయన భౌతిక అవశేషాలను పంపారు. అక్కడ వాటిని భద్రపరిచారు. ఇజ్రాయిల్ దేశంలోని గలలియ ప్రాంతంలో, క్రీస్తుశకం ఒకటో శతాబ్దంలో థామస్ జన్మించాడు. క్రీస్తు పునరుత్థానం తరువాత... క్రీస్తుశకం 52లో భారతదేశానికి వచ్చాడు. క్రీస్తుశకం 72లో చెన్నైలో హత్యకు గురయ్యాడు. మన దేశాన్ని ఎంతో ప్రామించిన థామస్ గౌరవార్ధం భారత ప్రభుత్వం 1964లో ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది.
కె.జె.రమేష్
ఇవి కూడా చదవండి
పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..