Couple Burnt Alive: అర్థరాత్రి ప్రియుడితో మహిళ.. బతికుండగానే కాల్చి చంపిన కుటుంబసభ్యులు..
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:52 PM
ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దారుణానికి ఒడిగట్టారు. బతికుండగానే మహిళపై, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్లో ఆలస్యంగా వెలుగుచూసింది.
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. మహిళ, ఆమె ప్రియుడిపై భర్త కుటుంబసభ్యులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు విడిచారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మొఖామ్పుర ఏరియాలోని బారోలావ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల సోని భర్త ఆరేళ్ల క్రితం చనిపోయాడు. సోని గత కొంతకాలం నుంచి అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల కైలాశ్ గుర్జార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. ఈ విషయం సోని అత్తింటి వారికి తెలిసింది.
వారు ఇద్దరిపై పగ పెంచుకున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నవంబర్ 28వ తేదీన అర్థరాత్రి సోని తన ప్రియుడ్ని కలవడానికి పొలాల్లోకి వెళ్లింది. సోని మామ, మరిది ఆమెను ఫాలో అయ్యారు. ఇద్దరూ ఒకే చోట ఉండగా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దర్నీ కట్టేసి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. మంటల్లో కాలుతూ సోని, కైలాశ్ కేకలు పెట్టసాగారు. ఆ అరుపులు విన్న గ్రామస్తులు అక్కడికి వచ్చారు. మంటలు ఆర్పి ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కైలాశ్ చనిపోయాడు. బుధవారం తెల్లవారు జామున సోని చనిపోయింది. పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసును మర్డర్ కేసుగా మార్చారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోని, కైలాశ్ల కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనలకు దిగారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వారితో చర్చలు జరిపారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి
మీ ప్రతిభకు టెస్ట్.. ఈ కొండపై మేక ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
అమెరికా జంట హత్యల కేసు.. నిందితుడిపై భారీ రివార్డ్