Sone Ki Chidiya: భారత్ను బంగారు పక్షి అని ఎందుకనేవారు?.. మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా..
ABN , Publish Date - May 25 , 2025 | 09:03 PM
శతాబ్దాల క్రితం భారత్ను 'సోనే కి చిడియా' అని పిలవడం వెనుక దేశ చారిత్రక సంపద, శ్రేయస్సు, వ్యవసాయం, ఖనిజాలు, ప్రకృతి, మేథస్సు వంటి ప్రతీదీ ఉంది. 'సోనా' అంటే లెక్కగట్టలేనంత సంపద ఉందని అర్థం. చిడియా అంటే పక్షి. హుందాతనం, స్వేచ్ఛకు ప్రతీక.

న్యూఢిల్లీ: శతాబ్దాలుగా భారత్కు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా పేరుంది. భారతదేశ సమున్నత సంస్కృతి, సంపన్న చరిత్ర ఇందుకు కారణం. అందుకే కవితాత్మంగా 'సోనే కీ చిడియా' (Sone Ki Chidiya)గా భారత్ను పిలుస్తుండేవారు. అంటే 'బంగారు పక్షి' (Golden Bird) అని అర్ధం. అయితే ఈ పదబంధానికి నిజమైన అర్ధం ఏమిటి? ఈ టైటిల్ వెనుక వాస్తవాలు, చరిత్ర ఏమిటో ఒకసారి చూద్దాం.
శతాబ్దాల క్రితం భారత్ను 'సోనే కి చిడియా' అని పిలవడం వెనుక దేశ చారిత్రక సంపద, శ్రేయస్సు, వ్యవసాయం, ఖనిజాలు, ప్రకృతి, మేథస్సు వంటి ప్రతీదీ ఉంది. 'సోనా' అంటే లెక్కగట్టలేనంత సంపద ఉందని అర్థం. చిడియా అంటే పక్షి. హుందాతనం, స్వేచ్ఛకు ప్రతీక.
భారత్ను గోల్డెన్ బర్డ్ అని ఎందుకనేవారు?
1.సహజ సంపద: భారతదేశం ఖనిజ సంపదకు ముఖ్యంగా బంగారం, వజ్రాలు, జాతిరత్నాలకు పుట్టినిల్లు. ఉపఖండం వాణిజ్య మార్గాలతో పట్టు, పత్తి, దంతాలు, రత్నాలు వంటి లగ్జరీ వస్తువులకు ఎగుమతిదారుగా ఉండేది.
2. అధునాతన నాగరికత: అధునాతన నాగరికత మనది. సింధు లోయ నాగరికత (c.3300-1300 BCE), ఆ తర్వాత మౌర్య, గుప్త, మొఘల్ సామ్రాజ్యాధిపతులు పాలన చేశారు. విద్య, వాణిజ్యం, కళలు వంటివి వారి కాలంలో ఎంతగానో ప్రోత్సహించారు.
3.గ్లోబల్ ట్రేడ్ సెంటర్: భారతదేశం అంతర్జాతీయ మారటైమ్, ఓవర్ల్యాండ్ ట్రేడ్ రూట్లకు కేంద్రస్థానంగా ఉంది. లోథల్ పేరుతో ఒక ముఖ్యమైన నౌకాశ్రయం, వాణిజ్య కేంద్రం ఇండియాకు ఉంది. ఆ తర్వాత కాలంలో కలకత్తా, సూరత్ వంటి నగరాలు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా భాసిల్లాయి. రోమన్, అరబ్ వర్తకులు తరచు భారత దేశ ఉన్నతిని హిస్టారికల్ రికార్డులలో ప్రస్తావించేవారు.
4. టాప్ జీడీపీ కంట్రిబ్యూషన్: ఎకనామిక్ స్టడీస్ను అధ్యయనం చేస్తే, ఫస్ట్ మిలీనియంలో ప్రపంచ జీడీపీలో భారతదేశ జీడీపీ 25 శాతంగా ఉందని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అంగస్ మాడిసన్ అంచనా వేశారు. దానినిబట్టి అప్పట్లోనే అత్యంత సంపన్న దేశంగా భారత్ ప్రపంచ రికార్డుల్లో నిలిచిందని ఢంకా బజాయించి చెప్పవచ్చు.
నిజంగానే బంగారు పక్షి ఉందా?
నిజానికి బంగారు పక్షి కానీ, ఒంటినిండా బంగరంతో ఉన్న పక్షి జాతులు కానీ లేవు. ఇదొక సింబల్ మాత్రమే. అయితే గోల్డెన్ ఓరియోల్ వంటి పక్షులకు బంగారు రంగులో ఈకలు ఉంటాయి. రంగును బట్టే వాటికి ఆ పేరే కానీ అది నిజమైన బంగారం కాదు. భారతీయ ఇతిహాసాలు, జానపద కథల్లో బంగారు పక్షులు కనిపిస్తాయి. జాతక కథలు, పంచరత్న కథల్లో వీటి ప్రస్తావన ఉంటుంది. నిజానికి శ్రేయస్సు, విజ్ఞానానికి ఇవి ప్రతీకలు.
వలసవాదుల ప్రభావం
'సోనే కి చిడియా' టైటిల్కు వెనుక చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. భారతదేశం ఒకప్పుడు సంపన్నదేశంగా ఖ్యాతి పొందిన దశలో బ్రిటీష్ వలసవాదులు దేశ సంపదను కొల్లగొట్టారు. 'గోల్డెన్ బర్డ్'ను పంజరంలో బంధించారు. భారతదేశ పురాతన వైభవానికి గ్రహణం పట్టింది. ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి ఏర్పడింది.
తిరిగి గోల్డెన్ బర్డ్ వైభవం సొంతమవుతుందా?
కాగా, గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం శీఘ్ర ఆర్థిక వృద్ధితో దూసుకుపోతోంది. టెక్నాలజీ, మాలిక వసతుల కల్పన, ఎంట్రపెన్యూర్షిప్ సహా అనేక రంగాల్లో అసమాన ప్రతిభ చూపుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో సమున్నత స్థానం వైపుగా దూసుకుపోతుంది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానానికి భారత్ ఎదిగింది. మరి కొద్దికాలంలోనే ప్రపంచ 3వ అతపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడటమే లక్ష్యంగా పురోగమిస్తోంది. పెరుగుతున్న ఆర్థిక వృద్ధి, యువజనాభా, అంతర్జాతీయంగా పెరుగుతున్న పలుకుబడితో భారత్ తిరిగి 'గోల్డెన్ బర్డ్' వైభవాన్ని పొందడం ఖాయమనే అభిప్రాయం ఇప్పుడు ఎల్లెడెలా వినిపిస్తోంది.