Shawls To Dogs: శాలువా కప్పి వీధి కుక్కలకు సన్మానం.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:43 AM
Shawls To Dogs: బీబీఎమ్పీలోని మొత్తం 8 జోన్లు.. ఈస్ట్, వెస్ట్, సౌత్, ఆర్ఆర్ నగర్, దాసరహళ్లి, బొమ్మనహళ్లి, యళహంక, మహాదేవపురంలలోని కుక్కలకు ఆహారాన్ని పంపిణీ చేయనుంది. బీబీఎమ్పీ ఈ స్కీమ్ను అమలు చేయడానికి.. ప్రతీ జోన్కు ఏటా 36 లక్షల రూపాయలు కేటాయించనుంది.

‘ది బృహత్ బెంగళూరు మహానగర పాలికే’ వీధి కుక్కల కోసం చికెన్ రైస్ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ స్కీములో భాగంగా బీబీఎమ్పీ సిబ్బంది కుక్కలకు ప్రతీ రోజూ చికెన్ రైస్ పెట్టనున్నారు. ఈ స్కీము ద్వారా బెంగళూరులోని 5 వేల కుక్కల కడుపు నిండనుంది. ఒక్కో కుక్కకు ప్రతీ రోజూ 22 రూపాయల చొప్పున.. సంవత్సరానికి 2.88 కోట్లు ఖర్చు అవ్వనుంది. ఇక, బీబీఎమ్పీ ప్రవేశపెట్టిన ఈ స్కీముపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రో కన్నడ యాక్టివిస్ట్ నాగరాజు బీబీఎమ్పీ నిర్ణయంపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారం బీబీఎమ్పీ హెడ్ ఆఫీసు ముందు కొన్ని వీధి కుక్కలకు శాలువా కప్పి సన్మానం చేశారు. వాటికి బిస్కెట్లు సైతం పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వీధి కుక్కలకు కొన్ని రోజులు ఆహారం పెట్టి తర్వాత మానేస్తే ఒప్పుకోము. వీధి కుక్కలతో ఆఫీసులోకి వచ్చి ధర్నా చేస్తాం. మీరు తీసుకువచ్చిన పథకంపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.
మీరు కొన్ని రోజులు ఆహారం పెట్టి తర్వాత మానేస్తే.. కుక్కలు మనుషుల మీద దాడి చేసే అవకాశం ఉంది’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కూడా చికెన్ రైస్ స్కీముపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జులై 10వ తేదీన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘వీధి కుక్కలకు వీధుల్లో చోటు లేదు. వాటిని షెల్టర్లకు పంపాలి. అక్కడే వాటికి ఆహారం ఇవ్వాలి. వాక్సిన్లు వేయించాలి. వీధుల్లో వాటికి భోజనం పెట్టడం ఆరోగ్యం పరంగా.. ప్రజల రక్షణ పరంగా మంచిది కాదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
పెళ్లి పార్టీలో దారుణం.. చికెన్ ముక్క కోసం స్నేహతుడి హత్య..
హారన్ విషయంలో గొడవ.. ఇంట్లోకి చొరబడి మరీ దారుణం..