Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:54 PM
శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇవాళ మరో అరెస్ట్ చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడైన పద్మకుమార్ను విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో ఇవాళ మరో అరెస్ట్ జరిగింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, సీపీఐ(ఎం)నేత, పద్మకుమార్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన పద్మకుమార్ను, విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆలయం బంగారు చోరీ కేసులో ఎనిమిదో నిందితుడుగా పద్మకుమార్ ఉన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్తో పద్మకుమార్కు సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరినట్లు సిట్ అధికారులు గుర్తించడంతో అరెస్ట్ చేసినట్టు సమాచారం. శబరిమల ఆలయ రికార్డులు పద్మకుమార్కు తెలిసే తారుమారైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రికార్డులలో బంగారు రేకులను.. రాగి రేకులుగా నమోదు చేసినట్టు సిట్ అధికారులు నిర్ధారించుకున్నట్టు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మమ్మర దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అయ్యప్ప ఆలయ పూజారిగా ప్రచారం చేసుకున్న ఉన్నికృష్ణన్ పొట్టి ఇంటి నుంచి రూ.2 లక్షల నగదును అక్టోబర్లో స్వాధీనం చేసుకున్నారు. పొట్టి నుంచి పసిడిని కొనుగోలు చేసిన బళ్లారికి చెందిన వ్యాపారి గోవర్ధన్ నుంచి 400 గ్రాముల బంగారంతో పాటు కొన్ని పసిడి నాణేలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బళ్లారిలో 'రొద్దమ్ జ్యువెలరీ' పేరుతో వ్యాపారం చేస్తున్న గోవర్ధన్ను అన్ని కోణాల్లోనూ విచారించారు. సిట్ కథనం ప్రకారం.. 2019 లోనే 476 గ్రాముల బంగారాన్ని గోవర్ధన్కు పొట్టి విక్రయించారు. వీరిద్దరి మధ్య పలు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఖాతాలు స్పష్టం చేశాయి. వీరు ప్రత్యేక నెట్ వర్క్ను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు సాగించారు. చెన్నైకి చెందిన 'స్మార్ట్ క్రియేషన్' మధ్యవర్తిగా వ్యవహరించింది.
కల్పేష్ అనే వ్యక్తి పొట్టి సూచనల మేరకు ఈ వ్యవహారాన్ని నడిపించారు. అయితే, పొట్టి అభ్యర్థన మేరకు అయ్యప్ప ఆలయం ద్వారానికి మరమ్మతులు చేశానని, ద్వారపాలకుల మరమ్మతుల గురించి తనకేమీ తెలియదని 'రొద్దమ్ జ్యువెలరీ' యజమాని గోవర్ధన్ సిట్కు ఇంతకు ముందు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News