Share News

Jodha Akbar: జోధాతో అక్బర్ పెళ్లి జరగలేదు.. రాజస్థాన్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - May 29 , 2025 | 09:06 PM

Jodha Akbar Marriage: జోధా అక్బర్ పెళ్లిపై రాజస్థాన్ గవర్నర్ హరభౌ బగదే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోధా బాయితో మొఘల్ చక్రవర్తి అక్బర్ పెళ్లి జరిగిందన్న దాంట్లో నిజం లేదన్నారు.

Jodha Akbar: జోధాతో అక్బర్ పెళ్లి జరగలేదు.. రాజస్థాన్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
Jodha Akbar Marriage

రాజస్థాన్ గవర్నర్ హరభౌ బగదే జోధా అక్బర్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జోధా బాయితో మొఘల్ చక్రవర్తి అక్బర్ పెళ్లి జరిగిందన్న దాంట్లో నిజం లేదన్నారు. బ్రిటీష్ వాళ్లు చరిత్రను తప్పుదోవపట్టించారని అన్నారు. బుధవారం సాయంత్రం ఉదయపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ జోధాకు అక్బర్‌కు పెళ్లి జరిగిందని అంటూ ఉంటారు. ఆ స్టోరీపై ఓ సినిమా కూడా వచ్చింది. చరిత్ర పుస్తకాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. కానీ, అది ఓ అబద్దం. భర్మల్ అని ఓ రాజు ఉండేవాడు. పని మనిషి కూతుర్ని అక్బర్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు.


అక్బర్‌నామలో ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేవు. మన హీరోల చరిత్రను బ్రిటీష్ వాళ్లు మార్చి రాశారు. వారు చరిత్రను సరిగా రాయలేదు. మొదట్లో అందరూ దాన్ని అంగీకరించారు. తర్వాత భారతీయులు చరిత్రను రాశారు. ఆ చరిత్రపై కూడా బ్రిటీష్ వాళ్ల ప్రభావం ఉంది. ఆత్మ గౌరవం విషయంలో మహా రాణా ప్రతాప్ ఎక్కడా తగ్గలేదు. కానీ, చరిత్రలో మాత్రం ఎక్కువగా అక్బర్ గురించే చెప్పారు. మహారాణా ప్రతాప్ గురించి చెప్పలేదు. కొత్త జాతీయ విద్యా పాలసీతో కొత్త జెనరేషన్స్‌ను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేస్తాం. దానితో పాటు మన సంస్కృతి, చరిత్రను భద్రపరుస్తాం.


శివాజీ మహరాజ్, మహారాణా ప్రతాప్‌ల పుట్టుకకు మధ్య 90 ఏళ్ల తేడా ఉంది. వాళ్లిద్దరూ ఒకే సమయంలో బతికి ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇద్దరూ ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. దేశ భక్తి కూడా ఎక్కువ’ అని అన్నారు. జోధా అక్బర్‌ల పెళ్లిపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి
రోడ్డుపై బరితెగించిన ఆటో డ్రైవర్.. ప్రాణాలు తీసే స్టంట్..

బ్రహ్మోస్‌తో పాక్‌పై దాడులు.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని షరీఫ్

Updated Date - May 29 , 2025 | 09:15 PM