Operation Sindoor: మోదీ విదేశీ పర్యటనలు వాయిదా, రేపు అఖిలపక్షం
ABN , Publish Date - May 07 , 2025 | 02:18 PM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. అటు, తన విదేశీ పర్యటనలు వాయిదా వేసుకున్నారు. రేపు అఖిలపక్షం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్.. పాకిస్థాన్ పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు వాయిదా వేసుకున్నారు. క్రొయేషియా, నెదర్లాండ్స్, నార్వే దేశాల పర్యటనను వాయిదా వేసుకున్నారని ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ఇండియా, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్పై దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ఇలా ఉండగా, భారత ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. భవిష్యత్ లో తీసుకోబోతున్న చర్యలు, యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రధాని, రాష్ట్రపతికి వివరించినట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా, రేపు మరోమారు అఖిలపక్షం భేటీ కాబోతోంది. యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ గురించి, భవిష్యత్ లో తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వం విపక్షాలకు వివరించనుంది.
ఆపరేషన్ సిందూర్ పై రేపు జరిగే అఖిలపక్ష సమావేశం చాలా కీలకం కానుంది. ఉదయం 11గం.లకు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది కేంద్రం. ఈ భేటీలో ప్రధాని మోదీ కూడా పాల్గొనే అవకాశం కన్పిస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరాలు వెల్లడించారు. పార్లమెంట్ కాంప్లెక్స్లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఆపరేషన్ సిందూర్ వివరాలు.. భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత తదితర విషయాలను అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది.