Share News

PM Modi Praises Hyderabad Startup: భారత అంతరిక్షానికి ఇన్ఫినిటీ ఉత్సాహం

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:08 AM

భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు.. హైదరాబాద్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పే్‌సకు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు...

PM Modi Praises Hyderabad Startup: భారత అంతరిక్షానికి ఇన్ఫినిటీ ఉత్సాహం

  • దేశ యువశక్తికి ‘స్కైరూట్‌ ఇన్ఫినిటీ’ క్యాంపస్‌ ప్రతిబింబం

  • ‘మన్‌ కీ బాత్‌’లో హైదరాబాద్‌ స్టార్ట్‌పపై మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు.. హైదరాబాద్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పే్‌స’కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ కేంద్రం దేశంలోని నవీన ఆలోచన, ఆవిష్కరణ, యువశక్తికి ప్రతిబింబంగా నిలిచిందని కొనియాడారు. 128వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన.. హైదరాబాద్‌కు చెంది న ఈ స్టార్టప్‌ సంస్థపై ప్రసశంసలు కురిపించారు. అలాగే.. ప్రపంచంలోనే అతిపెద్ద లీప్‌ ఇంజిన్‌ ‘మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో)’ సౌకర్యాన్ని ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించినట్టు వెల్లడించారు. విమాన నిర్వహణ, మరమ్మత్తు, పునఃపరిశీలన రంగంలో మనదేశం కీలక ముందడుగు వేసిందన్నారు. అలాగే.. ‘వోకల్‌ ఫర్‌-లోకల్‌’ను ప్రోత్సహించే క్రమంలో.. పలు దేశాల ప్రధానులకు కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ నైపుణ్యాన్ని పరిచయం చేశానని, వివిధ కళాకృతులను వారికి బహూకరించానని వెల్లడించారు. ‘‘మీరంతా ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అనే మంత్రాన్ని పాటించాలి’’ అని జి-20 శిఖరాగ్ర సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు, నాయకులను కోరినట్టు తెలిపారు. ‘‘మన దేశప్రజల తరఫున వారికి బహుమతులు అందించేటప్పుడు ఈ భావనను దృష్టిలో ఉంచుకున్నాను. జి-20 సందర్భంగా జపాన్‌ ప్రధానికి వెండి బుద్ధుడి ప్రతిరూపాన్ని బహూకరించాను. అది తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ప్రసిద్థ సిల్వర్‌ క్రాఫ్ట్‌ నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తుంది. అలాగే.. ఇటలీ ప్రధానికి పూల ఆకృతులతో కూడిన వెండి అద్దం బహుమతిగా ఇచ్చాను. అది కరీంనగర్‌ సంప్రదాయ లోహ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. ఇలా పలు దేశాధి నేతలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అద్భుతమైన కళా రూపాలను బహూకరించాను. భారతీయ హస్తకళలు, కళలు, సంప్రదాయాల గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడం, మన చేతివృత్తులవారి ప్రతిభను ప్రపంచానికి అందించడం నా లక్ష్యం. రాబోయే రోజుల్లో క్రిస్మస్‌, నూతన సంవత్సర షాపింగ్‌లో ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అనే మంత్రాన్ని గుర్తుంచుకోండి. దేశంలో తయారు చేసిన వాటిని మాత్రమే కొనండి. దేశప్రజలు కష్టపడి తయారుచేసిన వాటిని మాత్ర మే అమ్మండి’ అని మోదీ పిలుపునిచ్చారు.


అదే.. గొప్ప బలం

యువత అంకితభావం వికసిత్‌ భారత్‌కు గొప్ప బలమని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘సోషల్‌ మీడియాలో ఒక వీడియో కొన్ని రోజుల కిందట నా దృష్టి ని ఆకర్షించింది. ఈ వీడియో ఇస్రో నిర్వహించిన ఒక ప్రత్యేకమైన డ్రోన్‌ పోటీకి సంబంధించింది. ఈ వీడియోలో దేశ యువత ముఖ్యంగా మన జెన్‌-జీ అంగారక గ్రహ వాతావరణంలో డ్రోన్‌లను ఎగరవేసేందుకు ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు ఫలించలేదు. కానీ, పుణె నుంచి వచ్చిన యువకుల బృందం ఈ పోటీలో కొంతమేరకు విజయాన్ని సా ధించింది. వారి డ్రోన్‌ కూడా చాలాసార్లు పడిపోయి కూలిపోయినా పట్టు వదలలేదు. చాలా ప్రయత్నాల తర్వాత ఈ బృందం డ్రోన్‌ అంగారక గ్రహ వాతావరణంలో కొంతసేపు ఎగరగలిగింది. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు మరొక దృశ్యం గుర్తుకు వచ్చింది. చంద్రయాన్‌-2తో సంబంధం తెగిపోయినప్పుడు.. యావద్దేశం.. ప్రధానంగా శాస్త్రవేత్తలు కొద్దిక్షణాలు నిరాశకు లోనయ్యారు. కానీ, ఆ వైఫల్యం వారిని నిలువరించలేదు. చంద్రయాన్‌-3 విజయగాథను అదే రోజు రచిచండం మొదలుపెట్టారు. చంద్రయాన్‌-3 ల్యాండ్‌ అయిన క్షణం.. వైఫల్యాన్ని అధిగమించిన తర్వాత సాధించిన ఆత్మవిశ్వాస విజయం. సోషల్‌ మీడియాలో చూసిన ఆ వీడియోలో కనిపించిన యువకుల కళ్లలోనూ నేను అదే మెరుపును చూశాను. యువతరం చూపే ఈ అంకితభావం ‘వికసిత్‌ భారత్‌’కు గొప్ప బలం’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Updated Date - Dec 01 , 2025 | 05:08 AM