PM Modi: ఆపరేషన్ సిందూర్తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ
ABN , Publish Date - May 29 , 2025 | 12:36 PM
సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించిన ప్రధాని.. ఉగ్రమూకలకు భారత్ గట్టిగా జవాబిచ్చిందని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సిక్కిం ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్గా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సిక్కిం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయం చేస్తానని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.
‘పర్యాటక రంగ ప్రభావం ఎంత గొప్పదో సిక్కిం ప్రజలకు తెలుసు. పర్యాటకం అంటే విభిన్నత్వానికి ప్రతీక. ఇక, పహల్గాం ఘటన భారత్పై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదు. మానవత్వం, సోదరభావంపై జరిగిన దాడి’
‘ఎన్నో భారతీయ కుటుంబాల సంతోషాన్ని టెర్రరిస్టులు హరించారు. భారత్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, భారత ఐకమత్యం ఎంత గొప్పదో ప్రపంచం చూసింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశమంతా ఒక్కటై ఉగ్రవాదులకు దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమవడంతో పాక్ ఆక్రోశంతో మన సైన్యం, పౌరులపై దాడులకు తెగబడింది. దీంతో పాక్ బండారం బయటపడింది. పాక్ వైమానిక స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా భారత స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో వాళ్లకు చూపించాము’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని.. రాష్ట్రంలో పలు అభివృద్ధికారక ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. నమ్చీ జిల్లాలో రూ.750 కోట్లతో నిర్మించనున్న 500 పడకల జిల్లా ఆసుపత్రి, సాంగాచోలింగ్లోని ప్యాసెంజర్ రోప్వే, గాంగ్టాక్ జిల్లాలోని అటల్ అమృత్ ఉద్యానవనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈశాన్య రాష్ట్రాలే కేంద్రంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఢిల్లీలో జరిగిందన్న విషయాన్నీ మోదీ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. దీంతో, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని తెలిపారు.
వాస్తవానికి ప్రధాని మోదీ సిక్కిం అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రాన్ని సందర్శించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పశ్చిమ బెంగాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బాగ్డోగ్రా నుంచి ఆయన వర్చువల్గా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇవీ చదవండి:
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్మెన్ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్కు షాక్
పార్టీ మహిళా కార్యకర్తతో బీజేపీ సీనియర్ నేత అసభ్య ప్రవర్తన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి