Mallikarjun kharge: ఆపరేషన్ సిందూర్ చిన్న యుద్ధం
ABN , Publish Date - May 21 , 2025 | 07:45 AM
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధానికి ముందే సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ను ఆయన చిన్న యుద్ధంగా అభివర్ణిస్తూ, ప్రధాని మోదీ జవాబుదారీ తీరుని విమర్శించారు.

‘పహల్గాం’ గురించి ప్రధానికి ముందే తెలుసు: ఖర్గే
బెంగళూరు/బళ్లారి, మే 20(ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలను రక్షించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ను ‘చిన్న యుద్ధం’గా ఆయన అభివర్ణించారు. పహల్గాం దాడి గురించి ప్రధాని మోదీకి ముందే సమాచారం ఉందని, అందుకే జమ్మూకశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హోస్పేటలో మంగళవారం నిర్వహించిన సమర్పణ సంకల్ప ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడిలో 26 మంది చనిపోతే ప్రధాని మోదీ బిహార్లో ఎన్నికల ర్యాలీలు చేశారని, రెండుసార్లు జరిగిన అఖిలపక్ష సమావేశాలకు కూడా హాజరుకాలేదని ఖర్గే విమర్శించారు. ‘మేం గనుక ఈ భేటీలకు గైర్హాజరై ఉంటే.. మమ్మల్ని దేశద్రోహులుగా పిలిచేవారు’ అని ఖర్గే అన్నారు. కాగా, ఆపరేషన్ సిందూర్ చిన్న యుద్ధమన్న ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది.