Indian Climber On Mount Everest: ఎవరెస్ట్ పర్వతంపై భారతీయుడి మృతి.. డెత్ జోన్ వద్ద ఘటన..
ABN , Publish Date - May 16 , 2025 | 04:30 PM
ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన ఓ భారతీయుడు కిందకు దిగివస్తుండగా మృతి చెందారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన భారతీయుడు సుబ్రతా ఘోష్ (40) గురువారం మృతిచెందారు. శిఖరాగ్రానికి చేరుకున్న ఘోష్ ఆ తర్వాత కిందకి వచ్చే క్రమంలో హిల్లరీ స్టెప్కు దిగువన కన్నుమూసినట్టు తెలుస్తోంది. ‘‘ఆయన మరింత కిందకు దిగేందుకు నిరాకరించాడు’’ అని నేపాల్లోని స్నోయీ హొరైజన్ ట్రెక్ కంపెనీకి చెందిన బోధ్రాజ్ భండారి పేర్కొన్నారు. సుబ్రతా మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మృతదేహాన్ని పర్వతం దిగువన ఉన్న బేస్ క్యాంప్నకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని భండారీ తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. ఇక ఈ సీజన్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
ఎవరెస్ట్ పర్వతం శిఖరాగ్రానికి దిగువన 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాన్ని హిల్లరీ స్టెప్ అని పిలుస్తారు. ఇంత ఎత్తున గాల్లో ఆక్సీజన్ చాలా స్వల్పంగా ఉంటుంది. దీంతో.. ఈ ప్రాంతాన్ని డెత్ జోన్గా పిలుస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని దాటి శిఖరాగ్రానికి చేరుకోవడం కష్టంగా ఉండేదని అక్కడి వారు చెబుతుంటారు. 2015 నాటి భూకంపం తర్వాత హిల్లరీ స్టెప్ స్వరూపం కొద్దిగా మారడంతో పర్వతారోహణ కాస్తంత సులభతరం అయ్యిందట.
ఇక మరో ఘటనలో ఫిలిప్పీన్స్కు చెందిన ఫిలిప్ శాంటియాగో సైతం పర్వతారోహణలో ఉండగా బుధవారం కన్నుమూశారని అక్కడి పర్యాటక శాఖ అధికారి ఒకరు తెలిపారు. పర్వతంపై నాలుగో క్యాంప్ వద్దకు చేరుకునే సరికే అతడు బాగా అలిసిపోయాడు. అక్కడ విశ్రాంతి తీసుకునే క్రమంలోనే కన్నుమూశాడు.
తాజా పర్వతారోహణ సీజన్ మే నెలలో ముగియనుంది. ఈ సీజన్లో మొత్తం 459 మందికి ఎవరెస్ట్ ఎక్కేందుకు నేపాల్ ప్రభుత్వం అనుమతించింది. ఈ వారంలో సుమారు 100 మంది పర్వతారోహకులు తమ గైడ్ల సాయంతో పర్వతారోహణను విజయవంతంగా ముగించారు. ఇక గత వందేళ్లలో 345 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతంపై కఠిన వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక కన్నుమూశారు.
Also Read:
ట్రంప్పై కంగన పోస్టు.. బీజేపీ అధిష్ఠానం చెప్పడంతో ఆ వెంటనే డిలీట్
తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్ అనుమతులు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..
టర్కీ నుంచి దిగుమతులు ఆగిపోతే.. వీటి రేట్లు విపరీతంగా పెరుగుతాయి
కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి