Share News

RCB: బెంగళూరు తొక్కిసలాట.. బాధితులకు పరిహారాన్ని పెంచిన కర్ణాటక ప్రభుత్వం

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:28 PM

బెంగళూరు తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్టు కర్ణాటక ప్రభుత్వం తాజాగా పేర్కొంది.

RCB: బెంగళూరు తొక్కిసలాట.. బాధితులకు పరిహారాన్ని పెంచిన కర్ణాటక ప్రభుత్వం
Bengaluru stampede compensation

ఇంటర్నెట్ డెస్క్: ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం పెంచుతున్నట్టు సిద్దరామయ్య ప్రభుత్వం శనివారం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్టు వెల్లడించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 56 మంది గాయాలపాలయ్యారు.

‘మృతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్టు సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు’ సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బాధిత కుటుంబాలకు ఆర్సీబీ జట్టు యాజమాన్యం ప్రకటించిన రూ.10 లక్షల పరిహారానికి అదనంగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని ప్రకటించింది.


జూన్ 4న చిన్న స్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్‌సీబీ విజయోత్సవ సభకు సుమారు మూడు లక్షల మంది వచ్చారు. అయితే, రద్దీ నియంత్రణ పూర్తిగా విఫలం కావడంతో స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. పాస్‌లు ఉన్న వారే ఈ ఈవెంట్ రావాలన్న మార్గదర్శకాలు ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఈ దుర్ఘటన జరిగింది.

ఆర్సీబీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్.. రద్దీ నియంత్రణ కోసం సరైన భదత్రా ఏర్పాట్లు చేయలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. టిక్కెట్ లేని వారిని కూడా అనుమతిస్తారన్న సమాచారం సోషల్ మీడియాలో కూడా బాగా వ్యాప్తి చెందినట్టు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.


ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేఎస్‌సీఏ సెక్రెటరీ ఏ శంకర్, ట్రెజరర్ ఈ జైరామ్ తప్పుకున్నారు. ఇక బెంగళూరు పోలీస్ కమిషనర్ బీ దయానంద్‌ను కూడా కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులను బలిపశువులను చేశారని ప్రతి పక్షం విమర్శలు ఎక్కుపెడుతోంది. కమిషనర్‌ను సస్పెండ్ చేయడం బెంగళూరు చరిత్రలోనే చీకటి రోజని మాజీ కమిషనర్ భాస్కర్ రావు వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 07 , 2025 | 11:59 PM