Turkey: తుర్కియే సంస్థ ‘సెలెబి’పై వేటు
ABN , Publish Date - May 16 , 2025 | 04:37 AM
శత్రు దేశం పాకిస్థాన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న తుర్కియేపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్రం కూడా చర్యలకు ఉపక్రమించింది.

ఎయిర్పోర్టుల్లో భద్రతా సేవల అనుమతుల రద్దు
తక్షణమే అమల్లోకి ఈ నిర్ణయం: బీసీఏఎస్
పాకిస్థాన్కు మద్దతుగా ఉన్న తుర్కియే, అజర్బైజాన్లపై కేంద్రం చర్యలు
పర్యాటకం, వాణిజ్యం సహా వివిధ రంగాల్లో సంబంధాలు తెంపుకోవాలని యోచన
న్యూఢిల్లీ, మే 15: శత్రు దేశం పాకిస్థాన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న తుర్కియేపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్రం కూడా చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతా పరమైన సేవలను అందిస్తున్న తుర్కియేకు చెందిన సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియాపై వేటు వేసింది. ఆ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ (భద్రతా అనుమతుల)ను రద్దు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) గురువారం ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, అహ్మదాబాద్, గోవా, కన్నూర్ విమానాశ్రయాల్లో ‘సెలెబి’ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తోంది. ఇక తుర్కియేతో పాటు పాక్కు మద్దతుగా అజర్బైజాన్లతో పర్యాటకం, వాణిజ్యం సహా వివిధ రంగాల్లో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది.
రాబోయే రోజుల్లో ఆ రెండు దేశాలకు వెళ్లే వారి సంఖ్య, అక్కడ సినిమాల చిత్రీకరణలు గణనీయంగా తగ్గిపోవచ్చంటూ అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘భారత్ నుంచి యేటా లక్షలాది మంది ఆ రెండు దేశాలను సందర్శిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్లు, సినిమా చిత్రీకరణలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ దేశాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. రాబోయే రోజుల్లో ఆ దేశాల పర్యటనలకు ప్రభుత్వం సహకరించకపోవచ్చు.. సినిమా షూటింగ్లు తదితరాలకు మద్దతు ఉండకపోవచ్చు’ అంటూ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే తుర్కియే, అజర్బైజాన్ ఉత్పత్తులు, ఆ దేశాల పర్యటనలను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. వారంలో ఆ రెండు దేశాలకు భారీగా బుకింగ్లు పడిపోగా.. ప్రయాణాలు రద్దు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. విద్య పరమైన విషయాల్లో తుర్కియే విద్యా సంస్థలతో ఇక్కడి జేఎన్యూ సహా పలు యూనివర్సిటీలు ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు చూస్తున్నాయి. అలాగే అక్కడ సినిమాలు చిత్రీకరించవద్దంటూ భారత కళాకారులు, నిర్మాతలకు ఇప్పటికే ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్, ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.