Share News

Boycott Turkey: తుర్కియే ఉత్పత్తులు వద్దు!

ABN , Publish Date - May 17 , 2025 | 05:02 AM

తుర్కియే ఉత్పత్తులు, సేవలను దేశంలో బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో మొదలైన నిరసన సెగ తీవ్రమవుతోంది. ‘బ్యాన్‌ తుర్కియే’ నినాదం దేశం మొత్తం పాకుతోంది.

Boycott Turkey: తుర్కియే ఉత్పత్తులు వద్దు!

యాపిళ్ల దిగుమతిని నిలిపేసిన ఆజాద్‌పూర్‌ మండి.. ఆభరణాలు కొనబోమన్న లఖ్‌నవూ నగల వ్యాపారులు

  • దేశమంతా ‘బ్యాన్‌ తుర్కియే’ నినాదం

న్యూఢిల్లీ, మే 16: తుర్కియే ఉత్పత్తులు, సేవలను దేశంలో బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో మొదలైన నిరసన సెగ తీవ్రమవుతోంది. ‘బ్యాన్‌ తుర్కియే’ నినాదం దేశం మొత్తం పాకుతోంది. శత్రు దేశం పాకిస్థాన్‌కు వత్తాసు పలికినందుకు పర్యాటక, వాణిజ్య రంగాల్లో తుర్కియేపై పెద్ద దెబ్బే పడేలా కనిపిస్తోంది. వారం రోజులుగా ఆ దేశానికి భారీగా బుకింగ్‌లు పడిపోగా.. ప్రయాణాలు రద్దు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఇప్పటికే తుర్కియే యాపిళ్లను పుణే మార్కెట్‌.. అభరణాలను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆసియాలోనే అతిపెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్‌ అయిన ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండి.. తుర్కియే నుంచి యాపిళ్లు, ఇతర ఉత్పత్తుల దిగుమతులను నిలిపేస్తున్నట్లు తెలిపింది. రాజస్థాన్‌లోని అల్వార్‌ పండ్ల మార్కెట్‌ యూనియన్‌ కూడా తుర్కియే యాపిళ్లను కొనుగోళ్లు చేయబోమంటూ ప్రకటించింది. రాజస్థాన్‌కు రోజూ తుర్కియే నుంచి 15 టన్నులకు పైగానే యాపిళ్లు వచ్చేవని.. ఇకపై దిగుమతులు పూర్తిగా నిలిపేస్తున్నామని ఆ యూనియన్‌ వెల్లడించింది. ఇటు తుర్కియే అభరణాలను దిగుమతి చేసుకోబోమంటూ లఖ్‌నవూ నగల వ్యాపారులు ప్రకటించారు. ‘ఇకపై టర్కిష్‌ నగలను కొనకూడదని మేం నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చౌక్‌ సరఫా అసోసియేషన్‌ తెలిపింది. తుర్కియేతో పాటు పాక్‌కు మద్దతుగా ఉన్న అజర్‌బైజాన్‌లతో అన్ని వ్యాపార లావాదేవీలను నిలిపేయాలని నగల పరిశ్రమను భారత రత్నాభరణాల దేశీయ మండలి (జీజేసీ) కూడా కోరింది. అలాగే ఆ రెండు దేశాలతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను నిలిపేయాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) నిర్ణయించింది. ఇరు దేశాలతో ఇకపై ఎలాంటి వ్యాపారం జరగదని స్పష్టం చేసింది. ఈ విషయమై కేంద్రాన్ని కూడా కోరనున్నట్లు వెల్లడించింది. 24 రాష్ట్రాలకు చెందిన ట్రేడ్‌ నేతలంతా భేటీయైు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించింది.


మాది తుర్కియే కంపెనీ కాదు: సెలెబీ

విమానాశ్రయాల్లో భద్రతా సేవల అందించే సెలె బీ ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌ ఇండియాపై కేంద్రం వేటు వేయడంతో.. ఇస్తాంబుల్‌లో ఆ కంపెనీ షేర్‌ ధర 10 శాతానికి పైగా పతనమైంది. ఇటు అదానీ ఎయిర్‌పోర్టు సంస్థ కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ పరిణామాలతో స్పందించిన సెలెబీ యాజమాన్యం.. తమది తుర్కియే కంపెనీ కాదని వివరణ ఇచ్చింది. ఆ దేశాఽధ్యక్షుడు ఎర్డోగాన్‌ కుటుంబంతో తమ సంస్థకు ఏ సంబంధం లేదని.. యాజమాన్య హక్కులన్నీ సెలెబీయోగ్లు కుటుంబానివేనని స్పష్టంచేసింది. తమ మాతృసంస్థలో 65ు వాటా కెనడా, యూఎస్‌, యూకే, సింగపూర్‌ వంటి పలు దేశాల పెట్టుబడిదారులదేనని వెల్లడించింది.


భారత వర్సిటీల ఝలక్‌

పాక్‌కు అండగా నిలిచిన తుర్కియేకు మన యూనివర్సిటీలు కూడా ఝలక్‌లు ఇస్తున్నాయి. తుర్కియేలోని యూనస్‌ ఎమ్రే ఇన్‌స్టిట్యూట్‌తో విద్యా సంబంధిత అవగాహన ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకుంటున్నట్లు మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యూయూ) తాజాగా ప్రకటించింది. తుర్కియేతో ఎంఏఎన్‌యూయూ విద్యా సంబంధాలన్నీ ముగిసినట్లేనని స్పష్టం చేసింది. తుర్కియే, అజర్‌బైజాన్‌లలోని సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ కూడా ప్రకటించింది. తుర్కియే, అజర్‌బైజాన్‌లోని సంస్థలతో సంబంధాలు తెంచుకున్న భారత తొలి ప్రైవేటు యూనివర్సిటీ ఇదే.. కాగా, ఇప్పటికే జామియా మిలియా ఇస్లామియా కూడా తుర్కియే విద్యాసంస్థలతో ఒప్పందాలను నిలిపేసింది. అంతకుముందు.. జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకొని తుర్కియేలోని ఇనోను వర్సిటీతో కుదుర్చుకున్న విద్యా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జేఎన్‌యూ కూడా ప్రకటించింది.

Updated Date - May 17 , 2025 | 05:02 AM