Share News

Housing Regulations: పరదా కాపురాల పాట్లు!

ABN , Publish Date - Jul 30 , 2025 | 06:22 AM

బతుకుదెరువు కోసం దుబాయికి వచ్చే వారు ఎదుర్కొనే సమస్యల్లో ఇల్లు కీలకం. ఇళ్ల యజమానులు తమ ఇళ్లను అనేక

Housing Regulations: పరదా కాపురాల పాట్లు!

  • దుబాయిలో ఇరుకు గదుల్లో పలువురు తెలుగు ప్రవాసులు

  • మంచం పట్టేంత స్థలంలోనే కాపురం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) : బతుకుదెరువు కోసం దుబాయికి వచ్చే వారు ఎదుర్కొనే సమస్యల్లో ఇల్లు కీలకం. ఇళ్ల యజమానులు తమ ఇళ్లను అనేక భాగాలుగా విభజించి అద్దెకు ఇస్తుంటారు. అవెంత చిన్నగా ఉంటాయంటే, ఒక గది అంటే ఒక మంచం పట్టేంత స్థలం మాత్రమే. ఆ మంచం చుట్టూ ప్లైవుడ్‌ లేదా పరదాలు కట్టుకొని కాపురాలు చేసే దుస్థితి. ఇప్పుడు పలువురికి ఈ అవకాశం కూడా లేకుండా పోతోంది. ఈ తరహా నివాసాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీలు చేస్తూ యజమానులకు జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ఇంతకాలం చవకగా లభించిన ఆశ్రయం ఇకపై దూరం కానుంది.

సంపన్నుల నిలయమైన దుబాయిలో సగటు కార్మికుడికి పడుకునే చోటు లభించాలన్నా సవాలక్ష సమస్యలు. అనేక తెలుగు ప్రవాస కుటుంబాలు తమవారిని కలుసుకోవాలంటే ఏ రెస్టారెంట్‌లోనో, పార్కులోనో మాత్రమే కలుసుకుంటూ ఉంటాయి. ఇళ్లకు అతిథులను ఆహ్వానించడానికి వెనుకాడతారు. ఎందుకంటే కుర్చీ వేసుకోవడానికి కూడా స్థలం ఉండదు. దుబాయిలో అద్దెకు ఇచ్చే ఇళ్లు సైజులో పెద్దవేగానీ.. వాటిని నియమాలకు విరుద్ధంగా విభజించి మంచాలు లేదా గదుల వారీగా అద్దెకిస్తున్నారు. ఇది యజమానులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తోంది. ప్రవాసులకు చవకగా ఆశ్రయం లభిస్తోంది. దుబాయి నిబంధనల ప్రకారం ఒక గదిలో ఒక మనిషికి కనీసం 3.7 చదరపు మీటర్ల వైశాల్యం ఉన్న స్థలం ఉండాలి. కానీ ఆ సైజు లేదా దానికన్నా తక్కువ స్థలంలో ఒక జంట ఉంటోంది. ఒక గదిలో ఒక జంటకు బదులుగా నాలుగు జంటలు పరదాలు కట్టుకొని బంకు బెడ్డులలో కాపురం చేస్తుండగా, బ్యాచిలర్లయితే 10 మంది వరకు నివసిస్తున్నారు. తెలుగు ప్రవాసులు ఎక్కువగా ఉన్న దేరా, రిగ్గా, కరమా, సత్వా, ముర్రఖ్తబాద్‌, బర్‌ దుబాయిలలో ‘షేర్‌ అకాడమేషన్‌’ పేరిట ఈ సంస్కృతి ఎక్కువగా ఉంది. ఒక గది అద్దె 4 వేల దిర్హాంలు ఉంటే, నాలుగు జంటలు వెయ్యి దిర్హాంల చొప్పున చెల్లిస్తూ ఆ ఒక్క గదిలో ఉంటున్నాయి. మంచం చుట్టు పరదా లేదా ప్లైవుడ్‌తో తెరలాగా వేసుకుంటున్నారు.


ఆరోగ్య సమస్యలు.. అగ్ని ప్రమాదాలు

యజమానులు తమ ఇళ్లలోని మొత్తం స్థలాన్ని అద్దెకు ఇస్తుండటంతో.. గాలి, వెలుతురు లేని ఇరుకు కారణంగా పలువురు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు, అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దుబాయిలో జరుగుతున్న ఆగ్ని ప్రమాదాలలో 74 శాతానికి పైగా ఈ తరహా ఇరుకు గదులే కారణమని ఇటీవల ఓ అధికారిక నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో, షేర్‌ అకాడమేషన్‌పై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పోలీసులు, మునిసిపాల్టీ, విద్యుత్‌ అధికారులు సంయుక్తంగా తనఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. దీని వెనుక దుబాయి స్థిరాస్తి వ్యాపారుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. షేర్‌ అకామడేషన్‌ విధానం తమ వ్యాపారాభివృద్ధికి అడ్డంకిగా తయారైందని భావించి దానిని తొలగించటానికి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం నగరం నడిబొడ్డున నివసించిన తెలుగు ప్రవాసులు ఆశ్రయం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా, అద్దె తక్కువ ఉండే షార్జాకు తరలివెళ్తున్నారు. అయితే, ఇది చాలామందికి ఆర్థికంగా భారంగా పరిణమిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వందలాది మంది మహిళలు దుబాయిలో ఇళ్లలో పాచి పనులు చేస్తుంటారు. వీరందరూ షార్జాలో ఉండి దుబాయికి వెళ్లి రావటానికి డబ్బుపరంగా ఇబ్బందులు ఎదుర్కోవటమేగాక ప్రయాణ బడలికతో అలిసిపోతున్నారు. కాగా, దుబాయి శివారులో ఉన్న లేబర్‌ క్యాంపులలో వసతుల అభివృద్ధిపై సర్కారు దృష్టి సారిస్తోంది. 50 మందికిపైగా కార్మికులు ఉన్న ప్రతి సంస్థ విధిగా తమ లేబర్‌ క్యాంపు వసతి వివరాలను ప్రభుత్వం వద్ద నమోదు చేయాలని నిర్దేశిస్తున్నారు.

Updated Date - Jul 30 , 2025 | 06:22 AM