Opposition leader Kharge criticized the manner: రాజ్యసభలో ధన్ఖడ్ రగడ
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:45 AM
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం సభలో.. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ను....
న్యూఢిల్లీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం సభలో.. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ను ఉద్దేశించి స్వాగత ప్రసంగం చేసిన విపక్ష నేత ఖర్గే.. రాజ్యసభ మాజీ చైర్మన్ ధన్ఖడ్ను ఆకస్మికంగా పంపించేశారంటూ చేసిన వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ‘‘మీ(ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్) కంటే ముందు మీ సీట్లో ఉన్న ధన్ఖడ్ అనూహ్యంగా, ఎవరూ ఉహించని రీతిలో ఆకస్మికంగా రాజ్యసభ చైర్మన్గా నిష్క్రమించడం బాధాకరం. ఇది పార్లమెంటరీ చరిత్రలో ఎన్నడూ జరగనిది. కనీసం.. ఆయనకు వీడ్కోలు పలికే అవకాశం కూడా సభకు రాకపోవడం నన్నెంతో నిరాశకు గురిచేసింది’’ అని ఖర్గే అన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మీరు మాజీ చైర్మన్(ధన్ఖడ్) గురించి ఉపయోగించిన దారుణమైన పదాలు మరిచిపోయారా? ఎంతటి అభ్యంతరకరంగా, అవమానకరంగా వ్యవహరించారో అందరికీ గుర్తుంది’’ అని కిరణ్ రిజుజు అన్నారు. కాగా, రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్పై మోదీ ప్రశంసల జల్లుకురిపించారు. మరోవైపు, సభ్యులు ‘‘నిబంధనలు అనే లక్షణ రేఖకు కట్టుబడి ఉండాలి’’ అని రాధాకృష్ణన్ సూచించారు.