Groom Dies of Heart Attack: షాకింగ్.. తాళికట్టిన కొన్ని నిమిషాలకే హార్ట్ఎటాక్తో వరుడి మృతి
ABN , Publish Date - May 17 , 2025 | 07:50 PM
కర్ణాటకలో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. పెళ్లి వేడుకల్లో ఓ వరుడు హార్ట్ఎటాక్తో కుప్పకూలిపోయాడు. తాళి కట్టిన కొన్ని నిమిషాలకే మరణించాడు.

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి వేడుకలు జరుగుతుండగానే ఓ వరుడు కన్నుమూశారు. వధువుకు తాళి కట్టిన కొన్ని నిమిషాలకే హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందారు. కర్ణాటకలో శనివారం ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
బగాల్కోట్ జిల్లాలోని జామ్ఖండీ టౌన్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వరుడు ప్రవీణ్ (25) అప్పటివరకూ సంతోషంగా కనిపించాడు. వధువుకు తాళికట్టి కొన్ని నిమిషాలకు ఛాతిలో నొప్పి వస్తోందంటూ కుప్పకూలిపోయాడు. అక్కడిక్కడే కన్నుమూశాడు. ఈ షాకింగ్ దృశ్యం చూసి వధువుతో సహా పెళ్లికొచ్చిన వారందరూ నిర్ఘాంతపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం మిగిల్చింది. అప్పటిదాకా పెళ్లికళతో ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా మధ్యప్రదేశ్లో ఇటీవల సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. సంగీత్ వెడుకల సందర్భంగా డ్యాన్స్ చేసిన 23 ఏళ్ల వధువుకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్టేజీపైనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక గతేడాది డిసెంబర్లో యూపీకి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆటలు ఆడుతూ గుండెపోటుతో కన్నుమూశాడు.
ఇటీవల కాలంలో భారతీయ యువతలో అనేక మంది గుండెపోటు బారిన పడటం నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. కూర్చుని చేసే ఉద్యోగాల కారణంగా శరీరానికి కసరత్తు తగ్గిపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తినడం, ఉద్యోగ జీవితాల్లో ఒత్తిడి పెరగడం వంటివి గుండెపోటుకు దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ అనారోగ్యాలకు ముందు శరీరంలో వచ్చే మార్పులను కూడా యువత నిర్లక్ష్యం చేయడంతో విపరిణామాలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక.. శాశ్వత నిషేధం విధిస్తామంటూ వార్నింగ్
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి