Gensol Engineerings: ధోనీ, దీపికా పెట్టుబడిపెట్టిన జెన్సోల్ కొత్త CFO కూడా రాజీనామా
ABN , Publish Date - May 17 , 2025 | 04:24 PM
క్రికెటర్ ధోనీ, సినీతార దీపికా పదుకునే భారీగా పెట్టుబడులు పెట్టిన జెన్సోల్ ఇంజనీరింగ్కి సంబంధించి మరో అప్డేట్. తాజాగా ఈ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జబీర్మహెండి అగా రాజీనామా..

Gensol Engineerings: క్రికెటర్ ధోనీ దాదాపు రూ.400కోట్లు, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే పెట్టుబడిపెట్టినట్టుగా చెబుతున్న జెన్సోల్ ఇంజనీరింగ్కి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జబీర్మహెండి అగా కంపెనీకి రాజీనామా చేశారు. నిన్న(శుక్రవారం) అగా రాజీనామా చేసినట్టు కంపెనీ వెల్లడించింది. అప్పటి CFO అంకిత్ జైన్ రాజీనామా చేసిన తర్వాత ఈ ఏడాది మార్చిలో అగా కంపెనీకి CFOగా నియమితులయ్యారు. కేవలం రెండు నెలల కాలంలోనే అగా కంపెనీకి రాజీనామా సమర్పించడం విశేషం.
అగా తన రాజీనామా లేఖలో కంపెనీ ప్రస్తుతం పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని, జెన్సోల్ వ్యవహారాలపై బహుళ నియంత్రణ సంస్థలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయని అగా పేర్కొన్నారు. కంపెనీకి చెందిన వివిధ విభాగాలలో కీలకమైన డేటా అస్తవ్యస్తంగా ఉండటం, ఒక సమగ్రమైన మద్దతు వ్యవస్థ లేకపోవడం వల్ల కొనసాగుతున్న విచారణలకు సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం లేకుండా పోయిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇది తనను శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురిచేస్తుందని తెలిపారు.
మే 12న, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అన్మోల్ సింగ్ జగ్గి, కంపెనీ ఫుల్ టైమ్ డైరెక్టర్ పునీత్ సింగ్ జగ్గి రాజీనామా చేశారు. మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఏప్రిల్ 15న జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులో జగ్గీ సోదరులు కంపెనీలో కీలక పదవులు నిర్వహించకుండా నిషేధం విధించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు జెన్సోల్, జగ్గీ సోదరులు సెక్యూరిటీ మార్కెట్లోకి ప్రవేశించకుండా SEBI నిషేధించింది. దీంతో వీరిద్దరూ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు, సెబి తాత్కాలిక ఉత్తర్వు తర్వాత అంతకుముందు ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు అయిన, అరుణ్ మీనన్, కెఎస్ పాప్లి, హర్ష్ సింగ్ వరుసగా రాజీనామా చేశారు.
జెన్సోల్ కంపెనీకి రుణదాత అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (IREDA).. జెన్సోల్ ఇంజనీరింగ్ మీద అహ్మదాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో కేసు వేసింది. ఈ కేసులో జూన్ 3న తదుపరి విచారణ నాటికి కంపెనీ తన సమాధానం దాఖలు చేయాల్సి ఉంది. జెన్సోల్ ఇంజనీరింగ్ పొందిన ఐదు రుణాల డిఫాల్ట్లకు సంబంధించి కంపెనీపై IREDA పిటిషన్ దాఖలు చేసింది.
పిటిషన్ దాఖలు చేయడానికి ముందు, మే 4న IREDA, జెన్సోల్ కంపెనీకి రుణం తిరిగి చెల్లించాలని రీకాల్ నోటీసులు, డిమాండ్ నోటీసును పంపింది. కంపెనీ వ్యాపారం కోసం మంజూరు చేయబడిన మొత్తాన్ని రీకాల్ చేయడానికి, ఇతర వ్యాపారాల కోసం తీసుకున్న బకాయిలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. తదనంతరం, మే 13న IREDA ప్రమోటర్ల వ్యక్తిగత హామీని కోరింది. IREDA సదరు కంపెనీని రూ.510 కోట్ల మేర డిఫాల్ట్ను క్లెయిమ్ చేసింది.
కాగా, 2022- 2024 ఆర్థిక సంవత్సరం మధ్య IREDA, PFC నుంచి జెన్సోల్ రూ.977.75 కోట్ల రుణాలను పొందింది. రుణంలో రూ.663.89 కోట్లు 6,400 EVలను కొనుగోలు చేయడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే జెన్సోల్ రూ.567.73 కోట్ల విలువైన 4,704 EVలను మాత్రమే కొనుగోలు చేసినట్లు అంగీకరించిందని కార్ల సరఫరాదారైన గో-ఆటో ధృవీకరించింది. అయితే, 20 శాతం ఈక్విటీ మొత్తాన్ని జెన్సోల్ కూడా అందించాల్సి ఉన్నందున, మొత్తం వ్యయం రూ.829.86 కోట్లు అయి ఉండాలి. ఆ మొత్తాన్ని జెన్సోల్ కంపెనీ ఇవ్వకపోవడంతో రూ.262.13 కోట్లు లెక్క తేడా వస్తోంది.
సెబీ దర్యాప్తులో EV కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన నిధులు తరచుగా జగ్గీ సోదరులతో సంబంధం ఉన్న సంస్థలకు తిరిగి మళ్లించారని తేలింది. ఈ నిధులలో కొంత భాగాన్ని ప్రమోటర్ల వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించారు. ఉదాహరణకు లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు, దగ్గరి బంధువులకు బదిలీలు, ప్రమోటర్ల యాజమాన్యంలోని ప్రైవేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడులుగా పెట్టారు. అటు, కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై జెన్సోల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ సంస్థయిన బ్లూస్మార్ట్ మొబిలిటీ వ్యవహారాలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖా దర్యాప్తు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో క్రికెటర్ ధోనీతోపాటు, దీపికా పదుకునే ఫ్యామిలీ ఆఫీస్ భారీగా పెట్టుబడులు పెట్టారు.
ఇవి కూడా చదవండి
Gensol: జెన్సోల్ కంపెనీ వ్యవహారాలపై ప్రభుత్వ దర్యాప్తు..
Dhoni, Deepika-BluSmart: బాధితుల జాబితాలో ధోనీ, దీపికా పదుకొనే, ఇంకా..
జెన్సోల్ బ్లూస్మార్ట్పై కార్పొరేట్ శాఖ దర్యాప్తు
Read Latest National News And Telugu News
మనుషుల్ని దలదన్నేలా