Share News

Revenge After 50 Years: 4వ తరగతిలో గొడవ.. 50 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వృద్ధులు

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:03 PM

Revenge After 50 Years: జూన్ రెండవ తేదీన బాలకృష్ణన్ తన మిత్రుడు మాథ్యూతో కలిసి బాబు దగ్గరకు వెళ్లాడు. ‘నాలుగవ తరగతిలో నన్ను ఎందుకు కొట్టావురా’ అని బాలకృష్ణన్ .. బాబును అడిగాడు.

Revenge After 50 Years: 4వ తరగతిలో గొడవ.. 50 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వృద్ధులు
Revenge After 50 Years

కేరళలో ఓ వింత, విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన గొడవకు.. 50 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్నారు ఇద్దరు వ్యక్తులు. ప్రత్యర్థిని చావగొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని కాసర్ గడ్ జిల్లాకు చెందిన బాలకృష్ణన్, వీజే బాబు చిన్నపుడు కలిసి చదువుకున్నారు. 4వ తరగతి చదువుతున్న టైంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే వీజే బాబు .. బాలకృష్ణన్‌ను కొట్టాడు. ఆ పగ బాలకృష్ణ‌న్ మనసులో అలానే ఉండిపోయింది.


50 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఇద్దరి వయసు 60 సంవత్సరాలుపైనే ఉంటుంది. తాజాగా, బాలకృష్ణన్, వీజే బాబు స్కూలు రీయూనియన్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. రీయూనియన్ సందర్భంగా ఇద్దరి మధ్యా 4వ తరగతిలో జరిగిన గొడవ గురించిన ప్రస్తావన వచ్చింది. కొద్దిసేపటి తర్వాత అది గొడవగా మారింది. గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఇద్దరూ ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారు. తోటి మిత్రులు కలుగజేసుకుని గొడవను ఆపారు.


తర్వాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. గొడవ అంతటితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, అప్పుడే అసలు కథ మొదలైంది. జూన్ రెండవ తేదీన బాలకృష్ణన్ తన మిత్రుడు మాథ్యూతో కలిసి బాబు దగ్గరకు వెళ్లాడు. ‘నాలుగవ తరగతిలో నన్ను ఎందుకు కొట్టావురా’ అని బాలకృష్ణన్ .. బాబును అడిగాడు. ఆ వెంటనే బాబు చొక్కా పట్టుకున్నాడు. పక్కనే ఉన్న మాథ్యూ రాయితో బాబు ముఖంపై, వీపుపై దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. వారి దాడిలో బాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చేరాడు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు..

రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..

Updated Date - Jun 11 , 2025 | 01:03 PM